- కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో 1,913 మంది పోస్టులు ఔట్సోర్సింగ్
- ఇటీవల టెండర్లు పిలిచిన జెన్కో
- ఇతర రాష్ట్రాల ఏజెన్సీలు దక్కించుకుంటే స్థానికుల ఉపాధికి గండి
- తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం చేయడమేనంటూ విద్యుత్ ఉద్యోగుల ఫైర్
- టెండర్లు రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘాల ఆందోళన బాట
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో ‘ఔట్ సోర్సింగ్’ లొల్లి ముదురుతున్నది. జెన్కో నిర్వహణలో ఉన్న ఈ స్టేషన్లోని కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల లో 1,913 ఉద్యోగులను ఔట్సోర్సింగ్పై నియమించుకునేందుకు ఏజెన్సీ కోసం జెన్కో ఇటీవల టెండర్లు పిలిచింది. దీనిపై విద్యుత్ ఉద్యోగసంఘాలు భగ్గుమన్నాయి. ప్లాంట్కోసం భూములిచ్చిన నిర్వాసితులు, స్థానికుల ఉపాధికి గండికొట్టేలా ఉన్న టెండర్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇందులో భాగంగానే జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. గురువారం జెన్కో డైరెక్టర్కు వినతిపత్రం ఇవ్వగా.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పవర్ ప్లాంట్లలో నల్ల బ్యాడ్జీలతో విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలిపారు. టెండర్లు రద్దు చేయకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
స్థానికుల ఉపాధికి గండికొడ్తున్నారని ఉద్యోగ సంఘాల ఫైర్
రాష్ట్రంలో ఎన్నడూలేనిది జెన్కో నిర్వహించే పవర్ ప్లాంట్లలో ప్రైవేట్ టెండర్లను పిలిచే కొత్త సంప్రదాయంపై విద్యుత్ శాఖలోని ఉద్యోగ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. జెన్కోను ప్రైవేట్ పరం చేసే యోచనలో భాగంగానే యాదాద్రి కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. కాగా, జెన్కో పిలిచిన టెండర్ల ప్రకారం.. హై స్కిల్డ్ విభాగంలో 216, స్కిల్డ్ 444, సెమీ స్కిల్డ్ 419, అన్ స్కిల్డ్ విభాగంలో 834 మందిని నియమించనున్నారు.
వీరికి ఒక్కొక్కరికి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ, యాదాద్రి పవర్ ప్లాంట్కు భూములిచ్చిన సమయంలో అన్స్కిల్డ్పోస్టులను భూ నిర్వాసితుల కుటుంబాలు, స్థానిక యువత, నిరుద్యోగులకు ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ మాట నిలుపుకోవాలని ఉద్యోగసంఘాల నేతలు సూచిస్తున్నారు. అలాగే, స్కిల్డ్ పోస్టులకు జెన్కో నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వేలాది మంది నిరుద్యోగ ఇంజినీర్లు, ఐటీఐ అభ్యర్థులతో భర్తీ చేయవచ్చని చెప్తున్నారు.
ఇవన్నీ పక్కనపెట్టి కొత్తగా ప్రైవేట్ టెండర్లు పిలవడం సమంజసం కాదన్నారు. జైపూర్లోని సింగరేణి ప్లాంట్ మాదిరిగా ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీలు ఈ టెండర్ దక్కించుకుంటే ఆ రాష్ట్రాల వాళ్లకే ఉద్యోగాలు వెళ్లిపోతాయని, తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని వివరిస్తున్నారు.
1,913 ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం టెండర్లు
రాష్ట్రంలో జెన్కో ఆధ్వర్యంలో కొత్తగూడెం, చెల్పూర్, భధ్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో 4,080 మెగావాట్ల సామర్థ్యం ఉన్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. వీటికి కొత్తగా యాదాద్రిలో 4 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ జతకలిసింది. గతంలో జెన్కో ఆధ్వర్యంలో నిర్వహించే పవర్ ప్లాంట్ల ఆపరేషన్ అండ్ మేయింటనెన్స్మొత్తం జెన్కో ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ వచ్చారు. కానీ, యాదాద్రి థర్మల్ ప్లాంట్ విషయంలో మాత్రం కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో 1,913 ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఇటీవల టెండర్లు పిలిచారు. మూడేండ్ల కాలానికి రూ.255 కోట్లు చెల్లించేలా ప్రైవేట్ కంపెనీలు టెండర్లు దాఖలు చేయాలని కోరారు. ఈ నెల 29తో టెండర్ గడువు ముగుస్తుంది.
