కామారెడ్డిలో ప్రొటోకాల్​ రగడ

కామారెడ్డిలో ప్రొటోకాల్​ రగడ
  •     జిల్లా హాస్పిటల్​లో అడిషనల్​ బెడ్స్ ప్రారంభంపై వివాదం
  •     హాస్పిటల్​లో టెన్సన్ష్​ వాతావరణం

కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలో ప్రొటోకాల్​రగడ రాజుకుంది. జిల్లా హాస్పిటల్​బిల్డింగ్​పై అంతస్తులో రూ. 4.53 కోట్లతో నిర్మించిన అడిషనల్​ బెడ్స్​ఉన్న వార్డును శనివారం ప్రారంభించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతోందని ప్రకటించారు.

మంత్రి ప్రోగ్రామ్​కు హాజరుకాకపోవడంతో విశిష్ట అతిథిగా కార్యక్రమానికి వస్తున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ వార్డును ప్రారంభిస్తారని తెలుసుకొని శనివారం 11 గంటలకు ఎమ్మెల్యే హాస్పిటల్​లో ఆకస్మిక తనిఖీ చేశారు. సూపరింటెండెంట్​ఛాంబర్​లోకి వెళ్లి హాస్పిటల్​కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ప్రొటోకాల్ విషయమై హాస్పిటల్​ సూపరింటెండెంట్​డాక్టర్​రాంసింగ్, డీసీహెచ్​వో విజయలక్ష్మిని ప్రశ్నించారు.

ఆరోగ్యశ్రీ, ట్రామాకేర్, శానిటేషన్​కు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. గతంలో ఉన్న శానిటేషన్​ కాంట్రాక్టర్​ను మార్చి మరొకరికి ఎలా కేటాయించారని ఆఫీసర్లను ప్రశ్నించారు.  క్యాంటిన్, సులభ్ ​కాంప్లెక్స్​ నిర్మాణాలపై కూడా ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  ప్రజల మద్దతుతో గెలిచిన వారికి విలువ ఇవ్వకపోవడం సరికాదన్నారు.

ప్రారంభోత్సవానికి జిల్లాలోని మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, షబ్బీర్​అలీ, రేవంత్​రెడ్డిల్లో ఎవరో ఒకరు పోటీ చేయాలని సవాల్​ విసిరారు. 2 గంటల వరకు ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నారు. మధ్యాహ్నం 2.30 కు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ హాస్పిటల్​కు వచ్చారు. కలెక్టర్, ఇతర ఆఫీసర్లతో కలిసి అడిషనల్​ వార్డును ప్రారంభించారు. జిల్లా హాస్సిటల్​బయట, లోపల భారీ పోలీస్​ బందోబస్త్​ఏర్పాటు చేశారు.