మొక్కుబడిగా సాగిన హనుమకొండ జనరల్​బాడీ మీటింగ్​

మొక్కుబడిగా సాగిన హనుమకొండ జనరల్​బాడీ మీటింగ్​

ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఆఫీసర్లు డుమ్మా

హనుమకొండ, వెలుగు: ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన జడ్పీ జనరల్​బాడీ మీటింగ్ ను ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు లైట్​తీసుకున్నరు. సోమవారం హనుమకొండలోని కాన్ఫరెన్స్​ హాలులో జడ్పీ చైర్మన్​ డా.సుధీర్​ కుమార్​ అధ్యక్షతన హనుమకొండ జడ్పీ జనరల్​బాడీ నిర్వహించారు. జిల్లా పరిధిలోని లీడర్లు, వివిధ డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు లైట్​తీసుకోవడంతో సరైన చర్చ జరగకుండానే మొక్కుబడిగా మీటింగ్ ​ముగిసింది. కలెక్టర్​ రాజీవ్ గాంధీ హనుమంతు, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు  హాజరయ్యారు. వివిధ డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు ఆయా శాఖల ప్రగతి నివేదికలను సభ్యులకు చదివి వినిపించారు. ధర్మసాగర్, వేలేరు జడ్పీటీసీలు  పిట్టల శ్రీలత, చాడ సరిత  పీహెచ్​సీల్లో సరిపడా డాక్టర్లు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇన్​ఛార్జ్​, డిప్యూటేషన్​ డాక్టర్లు, సిబ్బందితో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని సభ దృష్టికి  తీసుకొచ్చారు.

డీఎంహెచ్​వో సాంబశివరావు స్పందిస్తూ.. తొందరలోనే డాక్టర్ల నియామకం పూర్తవుతుందని చెప్పారు. ధర్మసాగర్​ మండలంలో వివిధ రోడ్ల పనులు పెండింగ్​లో ఉన్నాయన్నారు. ఐనవోలు మండలంలో కరెంట్​సప్లైలో సమస్యలు ఉన్నాయని, వాటని పరిష్కరించాలని జడ్పీ వైస్​  చైర్మన్​ గజ్జెల శ్రీరాములు కరెంట్​ఆఫీసర్లకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఖబరస్తాన్​ నిర్మాణానికి చొరవ తీసుకోవాలని కో ఆప్షన్​ మెంబర్​ ఉస్మాన్​ వలీ కోరారు. ఇంకొందరు సభ్యులు గ్రామాల్లో మిషన్​ భగీరథ నీరు రంగుమారి వస్తున్నాయని చెప్పగా.. సమస్యను పరిష్కరిస్తామని ఆర్​డబ్ల్యూఎస్​ ఆఫీసర్లు సమాధానమిచ్చారు. అనంతరం జిల్లాలో ఎయిడ్స్​ నివారణకు కృషి చేసి వివిధ అవార్డులు సొంతం చేసుకున్న  డా.ఆచంట వివేకానంద ను కలెక్టర్, జడ్పీ చైర్మన్​ సహా సభ్యులు సన్మానించారు. 

లీడర్లంతా డుమ్మా

జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని  జిల్లా పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లైట్​ తీసుకున్నారు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కో ఆప్షన్​ మెంబర్స్​ అరకొరగా హాజరుకాగా.. గత మూడు, నాలుగు మీటింగుల నుంచి ఏ ఒక్క లీడర్​ కూడా హాజరుకాకపోవడం గమనార్హం. మీటింగ్​ హాలులోని కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి మార్గం చూపాల్సిన సమావేశాలు మొక్కుబడిగా సాగుతుండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.