PBKS vs RCB: కప్ కొడుతున్నాం.. జూన్ 4 న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడతాను: పంజాబ్ స్టార్ బ్యాటర్

PBKS vs RCB: కప్ కొడుతున్నాం.. జూన్ 4 న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడతాను: పంజాబ్ స్టార్ బ్యాటర్

ఐపీఎల్ 2025లో పంజాబ్ జట్టు  కాన్ఫిడెంట్ మాములుగా లేదు. ఆ జట్టు వరుసగా రెండు మ్యాచ్ లు గెలిస్తే తొలిసారి ట్రోఫీ గెలుస్తుంది. 2014 తర్వాత క్వాలిఫయర్ 1 ఆడుతున్న పంజాబ్.. ఈ సారి టైటిల్ వదలకూడదనే గట్టి పట్టుదలగా ఉంది. గురువారం (మే 29) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో క్వాలిఫయర్ 1 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్ కు వెళ్తుంది. ఒకవేళ ఓడిపోయినా క్వాలిఫయర్ 2 లో గెలిచి ఫైనల్ కు వెళ్లేందుకు మరో అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఫైనల్ కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే ఊపులో టైటిల్ కూడా గెలిచేస్తామని ఆ జట్టు స్టార్ బ్యాటర్ శశాంక్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. 

శశాంక్ సింగ్ మాట్లాడుతూ.. "అత్యుత్తమ విషయం ఏమిటంటే.. మా జట్టులో వ్యక్తిగత ప్రదర్శన కాకూండా జట్టుగా కష్టపడ్డాం. వేలం  తర్వాత మేము ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి ఈ సంవత్సరం టైటిల్ గెలుచుకోవడం గురించి మాట్లాడుకున్నాము. మా మొదటి లక్ష్యం టాప్-2 లో నిలవడం. మేము ఆ అడ్డంకిని అధిగమించాము. మొదటి రెండు స్థానాలను పూర్తి చేయడం అంటే సగం పని పూర్తయినట్లే. మేము  టైటిల్ గెలవాలనుకుంటున్నాము. జూన్ 4న ఉదయం 12 గంటలకు టైటిల్ గెలుచుకున్న తర్వాత మేము విలేకరుల సమావేశంలో కూర్చొని మేము ప్రపంచ ఛాంపియన్స్ అని చెబుతాం". అని శశాంక్ అన్నాడు. 

సోమవారం (మే 26) ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన తర్వాత 19 క్వాలిఫయర్ 1లో చోటు సంపాదించింది. ఈ మ్యాచ్ లో విజయంలో శశాంక్ పాత్ర లేకపోయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. ఈ సీజన్ కు ముందు పంజాబ్ కింగ్స్ కనీసం ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ శశాంక్ మాత్రం తన జట్టును నమ్మాడు. ప్లే ఆఫ్స్ కాదు ఏకంగా టాప్- 2 లో ఉంటుందని అంచనా వేశాడు. అతని అంచనా నిజమైంది. టోర్నీలో 14 మ్యాచ్ ల్లో 19 పాయింట్లతో పంజాబ్ టేబుల్ టాపర్ గా గ్రూప్ స్టేజ్ ముగించింది.