- ముంబై జోరుకు బ్రేక్
- 13 రన్స్ తేడాతో పంజాబ్ విక్టరీ
- రాణించిన కరన్, భాటియా, అర్ష్దీప్
ముంబై: హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న ముంబై ఇండియన్స్ జోరుకు పంజాబ్ కింగ్స్ బ్రేక్ వేసింది. బ్యాటింగ్లో స్టాండిన్ కెప్టెన్ సామ్ కరన్ (29 బాల్స్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 55), హర్ప్రీత్ సింగ్ భాటియా (28 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41).. బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్ (4/29) చెలరేగడంతో లీగ్లో నాలుగో విక్టరీ సొంతం చేసుకుంది. శనివారం రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన హై స్కోరింగ్ పోరులో పంజాబ్ 13 రన్స్ తేడాతో ముంబైని ఓడించింది. తొలుత పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 214/8 స్కోరు చేసింది. ఛేజింగ్లో ఓవర్లన్నీ ఆడిన ముంబై 201/6 చేసి ఓడింది. కామెరూన్ గ్రీన్ (43 బాల్స్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 67), సూర్యకుమార్ (26 బాల్స్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 57), రోహిత్ (44) పోరాడినా ఫలితం లేకుండాపోయింది. సామ్ కరన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.
గ్రీన్, సూర్య దంచినా.
భారీ టార్గెట్ ఛేజింగ్లో రెండో ఓవర్లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్ (1)ను ఔట్ చేసిన అర్ష్దీప్ సింగ్ ముంబైకి షాకిచ్చాడు. కానీ, కెప్టెన్ రోహిత్, గ్రీన్ పోటాపోటీగా షాట్లు కొడుతూ రెండో వికెట్కు 76 రన్స్ జోడించారు. పదో ఓవర్లో లివింగ్స్టోన్ రిటర్న్ క్యాచ్తో రోహిత్ను ఔట్ చేసినా.. గ్రీన్కు తోడైన సూర్యకుమార్ తన పేరుకు తగ్గట్టు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లివింగ్స్టోన్ బౌలింగ్లోనే హ్యాట్రిక్ ఫోర్లతో స్పీడు పెంచిన అతను.. అలవోకగా సిక్సర్లు కొట్టాడు. అటు గ్రీన్ కూడా అదే జోరు చూపడంతో ముంబై ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ, 16వ ఓవర్లో గ్రీన్ను ఔట్ చేసిన ఎలిస్ నాలుగో వికెట్కు 75 రన్స్ (36 బాల్స్లో) పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. 23 బాల్స్లోనే ఫిఫ్టీ దాటిన సూర్య క్రీజులో ఉండగా చివరి మూడు ఓవర్లలో ముంబైకి 40 రన్స్ అవసరం అయ్యాయి. అర్ష్దీప్ వేసిన 18వ ఓవర్లో సిక్స్ కొట్టిన సూర్య ఔట్ కావడంతో సమీకరణం12 బాల్స్లో 31గా మారింది. 19వ ఓవర్లో డేవిడ్ (25 నాటౌట్) సిక్స్ సహా 15 రన్స్ రాబట్టినా.. లాస్ట్ ఓవర్లో తిలక్ (3), ఇంపాక్ట్ ప్లేయర్ నేహాల్ (0)ను క్లీన్బౌల్డ్ చేసిన అర్ష్దీప్ పంజాబ్ను గెలిపించాడు.
కరన్, భాటియా జోరు
టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన పంజాబ్ మూడో ఓవర్లోనే ఓపెనర్ మాథ్యూ షార్ట్ (11) వికెట్ కోల్పోయింది. అయితే ప్రభ్సిమ్రన్ (26), అథర్వ తైడ్ (29) స్పీడ్గా ఆడటంతో పవర్ ప్లేలో పంజాబ్ 58/1 స్కోరు చేసింది. ప్రభ్ సిమ్రన్ ను అర్జున్ టెండూల్కర్, సీజన్లో తొలిసారి బరిలోకి దిగిన లివింగ్ స్టోన్ (10), అథర్వను పీయుష్ చావ్లా ఔట్ చేయడంతో 83/4తో పంజాబ్ కాస్త డీలా పడింది. ఈ టైమ్లో హర్ప్రీత్ సింగ్ భాటియా, సామ్ కరన్ చెలరేగి ఆడారు. ఫోర్లు సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఐదో వికెట్కు 50 బాల్స్లోనే 92 రన్స్ జోడించారు. భాటియాను గ్రీన్, కరన్ను ఆర్చర్ ఔట్ చేసినా.. ఆఖర్లో జితేష్ శర్మ (25) 4 సిక్సర్లతో చెలరేగడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో చావ్లా, గ్రీన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.