కోట్ల రూపాయల పనులు.. కొద్ది రోజులకే పగుళ్లు

కోట్ల రూపాయల పనులు.. కొద్ది రోజులకే పగుళ్లు
  •   కూలుతున్న డివైడర్లు ..  గుంతలు పడుతున్న రోడ్లు 
  •   సీఎం స్పెషల్​ఫండ్స్​తో చేపట్టిన వర్క్స్​ అస్తవ్యస్తంగా

కామారెడ్డి, వెలుగు: ఆఫీసర్ల పర్యవేక్షణ లోపంతో సీఎం స్పెషల్​ఫండ్స్​తో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించింది. దీంతో పనులు పూర్తయి, ప్రారంభానికి నోచుకోకముందే మళ్లీ రిపేర్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియాల్​చౌరస్తా నుంచి జిల్లా కేంద్రం మీదుగా నర్సన్నపల్లి వైపు హైవే వరకు డివైడర్​నిర్మించి, సెంట్రల్​ లైటింగ్​ఏర్పాటు చేశారు. ఈ పనులు జరిగి ఏడాది అవుతోంది. ఇంకా ప్రారంభించకముందే డివైడర్ ​కూలిపోయిది. పలు చోట్ల పగుళ్లు వచ్చాయి. నిజాంసాగర్​చౌరస్తా నుంచి దేవునిపల్లి శివారు వరకు నిర్మించిన డివైడర్​కూడా మధ్యలో రాళ్లు పడిపోయాయి. హౌజింగ్​బోర్డు కాలనీ నుంచి నర్సన్నపల్లి వరకు కొద్దిరోజుల క్రితమే చేపట్టిన బీటీ రోడ్డు మీద పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. పనులు కంప్లీటై ఏడాది కాకుండానే  రోడ్డు అధ్వాన్నంగా మారడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం స్పెషల్​ఫండ్స్​తో పనులు

2021, జూన్​లో కలెక్టరేట్ బిల్డింగ్​ప్రారంభానికి వచ్చిన సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో సౌలత్​లు కల్పించేందుకు ​రూ.50 కోట్ల స్పెషల్​ఫండ్స్​ప్రకటించారు. కొన్నాళ్లకు ఫండ్స్​రిలీజయ్యాయి. ఈ ఫండ్స్​తో టౌన్​లో మెయిన్​రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, కాలనీల్లో సీసీ రోడ్ల పనులు చేపట్టారు. ప్రధానంగా మెయిన్​రోడ్ల వెడల్పు, డివైడర్, సెంట్రల్​ లైటింగ్​వర్క్స్​కు ప్రయార్టీ ఇచ్చారు. వీటికి రూ.30 కోట్లు కేటాయించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టెక్రియాల్​చౌరస్తా నుంచి నర్సన్నపల్లి చౌరస్తా వరకు 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి, నిజాంసాగర్​చౌరస్తా నుంచి దేవునిపల్లి శివారు వరకు రోడ్డు వెడల్పు,సెంట్రల్​లైటింగ్, సిరిసిల్ల రోడ్డులో డివైడర్, సెంట్రల్​లైటింగ్​పనులు చేశారు.  నర్సన్నపల్లి నుంచి హౌజింగ్​బోర్డు వరకు ప్రస్తుతం 6 లైన్ల రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. పలు వార్డుల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణ పనులు కూడా జరిగాయి. ఆర్​అండ్​బీ, మున్సిపల్, పంచాయతీ రాజ్​శాఖల అధికారులు పనులను పర్యవేక్షించారు. 

పనుల్లో లోపాలు..

జిల్లా కేంద్రంలోని ఆర్​అండ్​బీ ఆఫీస్​నుంచి నర్సన్నపల్లి వరకు 4 లైన్ల రోడ్డు వేసిన ఏడాదిలోనే గుంతలు పడ్డాయి. హౌజింగ్​బోర్డు కాలనీ, నర్సన్నపల్లి చౌరస్తా సమీపంలోని బిడ్జిల మధ్య కొత్తగా వేసిన రోడ్డు కుంగిపోయింది. బ్రిడ్జికి, రోడ్డుకు జాయింట్​వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. బైక్స్, ఫోర్​వీలర్స్​కుంగిపోయిన ఏరియాకు రాగానే పైకి ఎగురుతున్నాయి. కొత్త వ్యక్తులు వెహికిల్స్​పై నుంచి కింద పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. అశోక్​నగర్​కాలనీ, పాత బస్టాండ్,​ దేవునిపల్లి తదితర ఏరియాల్లో సిమెంట్​కొట్టుకుపోయింది. 

మళ్లీ రిపేర్​చేయిస్తాం

టెక్రియాల్​నుంచి నర్సన్నపల్లి వరకు చేపట్టిన 4 లైన్ల రోడ్డు నిర్మాణం ఏడాదిన్నర కింద కంప్లీటైంది. వర్క్స్​క్వాలిటీగానే చేయించాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం. కొన్ని చోట్ల బీటీ పోయి గుంతలు ఏర్పడ్డాయి. గుంతలు పడిన చోట, బ్రిడ్జిల వద్ద కుంగిన చోట మళ్లీ రిపేర్​చేయిస్తాం. 
- శ్రీనివాస్, ఆర్​అండ్​బీ ఈఈ, కామారెడ్డి