ముషీరాబాద్, వెలుగు : బీసీల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వచ్చే బడ్జెట్లో బీసీల కోసం రూ. 25 వేల కోట్లు కేటాయించాలని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాగే ఎంబీసీ కార్పొరేషన్కు రూ. 2 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయడం లేదని, రూ. 25 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించి రెండున్నరేండ్లలో రూ. 10 వేల కోట్లు కూడా కేటాయించలేదన్నారు. పాత పథకాలకే పరిమితమయ్యారని, కొత్త పథకాలకు శ్రీకారం చుట్టకపోగా.. ఫీజులు, స్కాలర్షిప్లు, కార్పొరేషన్ లోన్లకు నిధులు విడుదల చేయడం లేదన్నారు. రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ... రాష్ట్రవ్యాప్తంగా 290 బీసీ గురుకులాలు, 325 కాలేజ్ హాస్టల్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ శాఖను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. బీసీలను విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అణిచి వేస్తున్నారని మండిపడ్డారు.
