పామాయిల్‌‌‌‌తో నెయ్యి.. యూరియాతో పాలు.. పౌడర్లు, కలర్లతో పసుపు, కారం

పామాయిల్‌‌‌‌తో నెయ్యి.. యూరియాతో పాలు.. పౌడర్లు, కలర్లతో పసుపు, కారం
  • నకిలీ ఇమ్యూనిటీ బూస్ట్​ ట్యాబ్లెట్లూ తయారీ  
  • రాచకొండ పరిధిలో పెద్ద ఎత్తున కల్తీ ఫుడ్ ఐటమ్స్ సీజ్
  • 46 కేసులు నమోదు.. పోలీసుల అదుపులో 52 మంది..

ఎల్బీనగర్, వెలుగు:  యూరియాతో పాలు, పామాయిల్‌‌‌‌తో నెయ్యి, కల్తీ పాలలో కెమికల్​వాడి పన్నీరు, అరటి కాండం, కెమికల్​కలిపి కుళ్లిన అల్లం వెల్లుల్లితో జింజర్​గార్లిక్​పేస్ట్, పలు పౌడర్లు, కలర్లు, కెమికల్‌‌‌‌తో పసుపు, కారం తయారు చేస్తున్న పలువురిని రాచకొండ ఎస్‌‌‌‌వోటీ పోలీసులు గురువారం పట్టుకున్నారు. వీరిలో కొందరు ఎక్స్​పైరీ డేట్​పూర్తయిన ఉత్పత్తులను షాపుల్లో కొని కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్టు తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. రాచకొండ కమిషనరేట్​పరిధిలోని ఎల్బీనగర్, మల్కాజ్ గిరి, మహేశ్వరం, భువనగిరి జోన్ పరిధిలో కల్తీ ఉత్పత్తులు అమ్ముతున్నారనే సమాచారంతో గురువారం పోలీసులు స్పెషల్​డ్రైవ్​నిర్వహించారు. ఈ సందర్భంగా శివారు ప్రాంతాల్లోని పలు గోదాములు, తయారీ కేంద్రాలు, ఫుడ్​ప్రాసెసింగ్​యూనిట్లు, పాల కేంద్రాలు , నెయ్యి తయారీ, అల్లం పేస్ట్ తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. 

ఎక్కడెక్కడ ఏం పట్టుకున్నారంటే..

ఎల్బీనగర్ జోన్ పరిధిలో నకిలీ నెయ్యి తయారు చేస్తున్న కేంద్రంపై దాడి చేసి 575 లీటర్ల కల్తీ నెయ్యి సీజ్ చేశారు. మహేశ్వరం, మల్కాజ్ గిరి జోన్ల పరిధిలో 3,946 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, భువనగిరి జోన్ పరిధిలో ఓ స్థావరంపై దాడి చేసి 250 కిలోల కల్తీ పన్నీర్​స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 46 క్రిమినల్ కేసులు నమోదు చేసి 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.  ఎవరైనా కల్తీ ఉత్పత్తులు అమ్ముతున్నట్టయితే 8712662666 వాట్సాప్​ద్వారా సమాచారం అందించవచ్చిని తెలిపారు.

ఇమ్యూనిటీ బూస్టర్స్​ తయారీ..

కరోనా టైం నుంచి ఇమ్యూనిటీ బూస్ట్​పెంచే ట్యాబ్లెట్లు, మందులకు డిమాండ్​పెరిగింది. దీంతో రోగ నిరోధక శక్తి కోసం చాలామంది ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకుంటున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది పేరున్న కంపెనీలకు సంబంధించిన లేబుల్స్​వాడుకుంటూ నకిలీ ఇమ్యూనిటీ బూస్టర్స్​తయారు చేస్తున్నారు. రాచకొండ ఎస్‌‌‌‌వోటీ పోలీసుల దాడుల్లో ఈ విషయం వెల్లడైంది. గురువారం నిర్వహించిన దాడుల్లో మల్కాజిగిరిలో ఈ ట్యాబ్లెట్లను తయారు చేస్తున్నట్టు గుర్తించి పట్టుకున్నారు. పెద్ద సంఖ్యలో నకిలీ ఇమ్యూనిటీ బూస్టర్లను స్వాధీనం చేసుకున్నారు.