న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది చెప్పినట్లే జరిగింది. రాఘవ్ చద్దా బీజేపీలో చేరతాడని ముందే చెబుతూ.. రాజ్యసభలో పార్టీ అధికారిక పదవి నుంచి తొలగించింది ఆప్. ఇది జరిగిన 10 రోజులు గడవకముందే.. ఆప్ పార్టీ చెప్పినట్లే జరిగింది. ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు.
ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నేత, రాజ్య సభ ఎంపీ రాఘవ్ చద్దా ఆప్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. చద్దాతో పాటు ఆప్ రాజ్యసభ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ శుక్రవారం (ఏప్రిల్ 24) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకేసారి ముగ్గురు ఎంపీలు పార్టీని వీడి బీజేపీలో చేరడంతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్కు బిగ్ షాక్ తగిలింది.
గత కొంత కాలంగా పార్టీ హైకమాండ్తో రాఘవ్ చద్దాకు పొసగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేసి కాషాయ పార్టీ గూటికీ చేరారు. అయితే, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ ఆప్కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం మాత్రం ఊహించని పరిణామం.
ఈ సందర్భంగా అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్తో కలిసి రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇన్ని రోజుల్లో సరైన పార్టీలో లేనని ఆప్ను విమర్శించారు. సొంత పార్టీనే తనను అణగొక్కేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల సభ్యులమైన మేము భారత రాజ్యాంగ నిబంధనలను అనుసరించి బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

