- ఎంపీ రఘునందన్రావు డిమాండ్
- సీఎం లేఖ రాస్తే, కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీకి విజ్ఞప్తి చేస్తానని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై మూడు బ్యారేజీలకే పరిమితం కాకుండా.. డీపీఆర్ నుంచి చివరి చెల్లింపు వరకు సీబీఐతో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తే కేంద్ర హోంమంత్రిని కలిసి సమగ్ర విచారణ జరిగేలా సహకరిస్తానని ఎంపీ రఘునందన్రావు అన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. యూనిటీ మాల్ నిర్మాణానికి సంబంధించి జరిగిన ఒప్పందంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
2018లో బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూకేటాయింపులపైనా విచారణ చేయాలని కోరారు. కేంద్రం ఇచ్చిన రూ.202 కోట్లతో చేపట్టిన యూనిటీ మాల్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరపాలన్నారు. కేటీఆర్ తప్పు చేస్తే విచారణ చేసిన ప్రభుత్వం.. కాంగ్రెస్ నేతలు తప్పు చేస్తే ఎందుకు విచారణ చేయదని ప్రశ్నించారు. రెండు ఒప్పందాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ కోరుతూ కేంద్ర విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో ఎకరం భూమి విలువ వందల కోట్లకు చేరిందన్నారు. ప్రజల ఆస్తులకు ప్రభుత్వాలు కాపలాదారులుగా ఉండాలి తప్ప యజమానులుగా వ్యవహరించొద్దని చెప్పారు. అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ బొమ్మా-బొరుసు లాంటివని విమర్శించారు.
