కేసీఆర్ ​పైసలు, పోలీసోళ్లను నమ్ముకున్నడు: రఘునందన్​రావు

కేసీఆర్ ​పైసలు, పోలీసోళ్లను నమ్ముకున్నడు: రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు : కేసీఆర్​పైసలు, పోలీసోళ్లను నమ్ముకుంటే బీజేపీ ప్రజలను నమ్ముకుని ఎన్నికల రంగంలోకి దిగిందని ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. మంగళవారం దుబ్బాక మారెమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసి మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్​పాత్రతో కలిసి దుబ్బాకలో నామినేషన్​ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం ఆరు దాటితే అనారోగ్యానికి గురైన ప్రజలకు డాక్లర్లు దొరకరు గానీ కేసీఆర్​కు ఇష్టమైన లిక్కర్​ మాత్రం పుష్కలంగా దొరుకుతుందని ఎద్దేవా చేశారు.

నదులకు నడక నేర్పిన కేసీఆర్​ గోదావరిపై రూ. లక్ష కోట్లతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్​ పనికి రాకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం ఒక్ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదని, లీకేజీల పేరుతో కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. మీ ప్రభుత్వం కారణంగా సూసైడ్​ చేసుకున్న  నిరుద్యోగుల ఇంటికి మంత్రి హరీశ్​రావు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. యువ మేళా సమ్మేళన పేరుతో మంత్రి కేటీఆర్​ ఏ మొఖం పెట్టుకుని దుబ్బాకకు వస్తున్నారని ధ్వజమెత్తారు. తొమ్మిదేండ్లుగా ఎంపీగా పని చేస్తున్న ప్రభాకర్​రెడ్డి దుబ్బాకకు నిధులివ్వకుండా గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకు నిధులు ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు.