- లోక్సభలో వెల్లడించిన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ
- ప్రొఫెషనల్గా మీటయ్యానంటూ కేంద్ర మంత్రి వివరణ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్ స్టీన్ ఫైల్స్ ఇప్పుడు ఇండియాలోనూ కలకలం రేపుతున్నాయి. ఈ ఫైల్స్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పేరుందని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికా న్యాయ శాఖ ఇటీవల విడుదల చేసిన ఫైల్స్ లో హర్దీప్ సింగ్ పురి పేరు కూడా ఉందని బుధవారం లోక్ సభలో రాహుల్ వెల్లడించారు. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూర్తి మధ్యాహ్నం స్పందించారు.
రాహుల్ ఆరోపణలకు వివరణ ఇస్తూ.. జెఫ్రీ ఎప్స్టీన్ను తాను కలిసిన మాట నిజమేనని హర్దీప్ చెప్పారు. అయితే, ఆయనపై ఉన్న నేరారోపణలకు తమ మధ్య జరిగిన సంభాషణలకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. అమెరికా విడుదల చేసిన 30 లక్షల ఈమెయిల్స్లో కేవలం మూడు, నాలుగు సార్లు తన పేరు ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు. ఎప్ స్టీన్ కు తాను ఒకే ఒక ఈమెయిల్ పంపానని వివరించారు. ఈమేరకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో హర్దీప్ సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి క్లారిటీ ఇచ్చారు.
"ఎప్స్టీన్ను 3, 4 సార్లు మాత్రమే కలిశాను. అది కూడా ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్(ఐపీఐ) ప్రతినిధుల బృందంలో భాగంగా కలిశాను. ఐపీఐలో మా బాస్ టెర్జే రాడ్-లార్సెన్ కు ఎప్స్టీన్ తెలుసు. కాబట్టి ఎప్స్టీన్ తో ప్రొఫెషనల్ గా మీటింగ్లు జరిగాయి. అంతే. ఎప్స్టీన్ లైంగిక నేరాలు, ఐలాండ్ క్రైమ్స్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. బిజినెస్ నెట్వర్కింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కోసం ఎప్ స్టీన్కు ఓ ఈమెయిల్ పంపించాను. నేను వారికి 'రైట్ పర్సన్' కాదని భావించారు. అతడు నన్ను నమ్మదగని వ్యక్తి అని పిలిచాడు" అని హర్దీప్ సింగ్ పురి వివరించారు. ఎప్స్టీన్తో ఇంటరాక్షన్స్ ప్రొఫెషనల్ అని, రాజకీయ ఆరోపణలు బేస్లెస్ అని ఆయన పేర్కొన్నారు.
