కొత్త పాస్పోర్ట్ కోసం కోర్టుకు వెళ్లిన రాహుల్
న్యూఢిల్లీ : కొత్త పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ఇవ్వాలంటూ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన మెట్రోపాలిటన్ కోర్టు.. రాహుల్ అభ్యర్థనపై లిఖితపూర్వక స్పందన తెలపాలంటూ బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామిని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ కేసులో సబ్రమణ్యస్వామి ఫిర్యాదుదారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ దాఖలుచేసిన పిటిషన్పై సుబ్రమణ్యస్వామి స్పందనను కోర్టు కోరింది. సుబ్రమణ్యస్వామి గడువు కోరడంతో కేసు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. కాగా, లోక్ సభ సభ్యత్వం కోల్పోవడంతో రాహుల్ గాంధీ తన డిప్లొమాటిక్ పాస్ పోర్టును అధికారులకు అప్పగించారు. ఆర్డినరీ పాస్ పోర్టు కోసం రాహుల్ గాంధీ కొత్తగా దరఖాస్తు చేసుకోనున్నారు.