గెహ్లాట్​తో విభేదాలపై​ సచిన్​ పైలట్ వ్యాఖ్య

గెహ్లాట్​తో విభేదాలపై​ సచిన్​ పైలట్ వ్యాఖ్య
  • జోడో యాత్రను సక్సెస్​ చేస్తమని కామెంట్​ చేసిన కాంగ్రెస్​ లీడర్​
  • రాజస్థాన్​ కాంగ్రెస్​లో అందరూ కలిసే ఉన్నారని వివరణ

 

న్యూఢిల్లీ: రాజస్థాన్​లో కాంగ్రెస్​ లీడర్లంతా కలిసిమెలిసి ఉన్నారని, ఎవరితో ఎవరికీ ఎలాంటి విభేదాల్లేవని పార్టీ సీనియర్​ లీడర్​ సచిన్​ పైలట్​ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర ఆదివారం రాజస్థాన్​లో ఎంటర్ అయ్యిందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్​లో యాత్రను సక్సెస్​ చేయాలన్న దానిపైనే అందరి ఫోకస్ ఉందని చెప్పారు. సీఎం అశోక్​ గెహ్లాట్​తో తనకు ఎలాంటి సమస్య లేదన్నారు. సీఎం పోస్టు కోసం బీజేపీలోనే డజన్ల కొద్ది ఆశవాహులు ఉన్నారని విమర్శించారు. అసలైతే బీజేపీలోనే అంతర్గత పోరు నడుస్తున్నదన్నారు. 

మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కష్టపడి పని చేస్తామని సచిన్​ పైలెట్​ అన్నారు. భారత్​ జోడో యాత్రపై చర్చించేందుకే గత వారం పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ జైపూర్​ వచ్చారని తేల్చి చెప్పారు. కొందరు కావాలనే కాంగ్రెస్​ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భారత్ జోడో యాత్రకు సంబంధించినంత వరకు, పార్టీలో ఏకాభిప్రాయం ఉందని, దాన్ని విజయవంతం చేయడానికి తామంతా కలిసి పని చేస్తున్నట్టు వివరించారు. నెక్ట్స్​ జనరేషన్​ మాట్లాడుకునేలా యాత్రను సక్సెస్​ చేయడమే తమ ముందు ఉన్న లక్ష్యం అన్నారు. కాంగ్రెస్​ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఫస్ట్​ టైం భారత్​ జోడో యాత్ర సాగుతున్నదని పైలట్​ చెప్పారు.