
- పుణే ప్రజాప్రతినిధుల కోర్టులో అఫిడవిట్ దాఖలు
- తనపై కేసు వేసిన సాత్యకి సావర్కర్ ఈ విషయం దాచారని వెల్లడి
న్యూఢిల్లీ: ప్రముఖ హిందూత్వ నాయకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ కు మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేకు మధ్య బంధుత్వం ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పుణే ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై దాఖలైన పరువు నష్టం కేసులో వాదనల సందర్భంగా ఈ సంచలన విషయం పేర్కొన్నారు. తనపై కేసు వేసిన వీడీ సావర్కర్ మనవడు సాత్యకి సావర్కర్ తల్లి హిమానీ సావర్కర్.. నాథూరామ్ గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సే కుమార్తె అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఏమిటీ కేసు?
2023 మార్చిలో లండన్లో రాహుల్ గాంధీ చేసిన ఒక ప్రసంగం వీడీ సావర్కర్ను అవమానించేలా ఉందని సాత్యకి సావర్కర్ 2025 జనవరిలో పూణెలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువునష్టం కేసు వేశారు. సావర్కర్, మరికొందరితో కలిసి ఒక ముస్లిం వ్యక్తిని కొట్టడం ఆనందంగా భావించారని, ఇది భీరుత్వమని రాహుల్ తన ప్రసంగంలో పేర్కొన్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సావర్కర్ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని సాత్యకి ఆరోపించారు.
సాత్యకి సావర్కర్ తన తల్లి వంశవృక్షాన్ని దాచారని రాహుల్ తరఫు న్యాయవాది మిలింద్ పవార్ కోర్టుకు తెలిపారు. హిమానీ సావర్కర్.. గోపాల్ గాడ్సే కుమార్తె అని అందులో పేర్కొన్నారు. గోపాల్ గాడ్సే, నాథూరాం గాడ్సే సోదరుడని, వారిద్దరూ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలారని చెప్పారు. సాత్యకి తన తల్లికి గాడ్సే కుటుంబంతో ఉన్న రిలేషన్ దాచిపెట్టారని, ఈ విషయంలో విశ్రంబాగ్ పోలీస్ స్టేషన్లో విచారణ జరపాలని మిలింద్ పవార్ కోర్టును కోరారు.
సాత్యకి తరఫు న్యాయవాది సంగ్రామ్ కోల్హత్కర్, రాహుల్ చేసిన కామెంట్లు సావర్కర్ రచనల్లో లేవని, అవి కల్పితమని వాదించారు. రాహుల్ తన ప్రసంగంలో కోట్ చేసిన పుస్తకాన్ని పరిశీలించాలని కోర్టును కోరారు. కోర్టు రాహుల్ తరఫు న్యాయవాదికి మే 28న సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నది. రాహుల్ తాజా వాదనలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆ ప్రాంతాలకు పునరావాస ప్యాకేజీ ఇవ్వండి
సరిహద్దు వెంట పాకిస్తాన్ షెల్లింగ్తో ప్రభావితమైన పూంచ్, ఇతర ప్రాంతాలకు తక్షణ, పునరావాస ప్యాకేజీ అందించాలని రాహుల్ గాంధీ గురువారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. మే 7 నుంచి 10 మధ్య పాక్ జరిపిన దాడుల్లో బాధితులైన కుటుంబాలను రాహుల్ గత శనివారం పరామర్శించారు. పాక్ దాడుల్లో ఇండ్లు, దుకాణాలు, పాఠశాలలు, మత స్థలాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. దాదాపు 14 మంది చనిపోయారన్నారు. బాధితుల కష్టాలను అర్థం చేసుకొని సహాయం అందించాలని కోరారు.
కర్నాటకలో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత భేష్
కర్నాటకలో కాంగ్రెస్ సర్కారు గిగ్ వర్కర్ల కోసం తెచ్చిన ఆర్డినెన్స్ చరిత్రాత్మకమని రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసేందుకు కృషి చేస్తామని ట్వీట్ చేశారు. రాజస్థాన్ ఈ దిశలో మొదటి అడుగు వేయగా, కర్నాటక చేసి చూపించిందని, నెక్స్ట్ తెలంగాణ అమలు చేస్తుందని అన్నారు. కాగా, కర్నాటక ప్రభుత్వం గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, ఫెయిర్ కాంట్రాక్ట్, పారదర్శక వేతన విధానం ఉండేలా ఆర్డినెన్స్ జారీ చేసింది.