
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన సెక్యూరిటీ ప్రొటోకాల్ పాటించడం లేదని సీఆర్పీఎఫ్ ఆరోపించింది. అంతేకాకుండా ఎవరికీ చెప్పకుండా విదేశాలకు వెళ్తున్నారని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు సీఆర్పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ జూనే లేఖ రాశారు. తన సెక్యూరిటీ కవర్ ను రాహుల్ సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు.
విదేశాల్లో ఉన్నప్పుడూ రాహుల్ సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉల్లంఘించారని చెప్పారు. నిరుడు డిసెంబరు 30 నుంచి జనవరి 9 వరకు ఇటలీలో, ఈ ఏడాది మార్చి 12 నుంచి 17 వరకు వియత్నాంలో, ఏప్రిల్ 17 నుంచి 23 వరకు దుబాయ్ లో, జూన్ 11 నుంచి 18 వరకు ఖతార్ లో, జూన్ 25 నుంచి జులై 6 వరకు లండన్ లో, ఈనెల 4 నుంచి 8 వరకు మలేషియాలో రాహుల్ పర్యటించారని ఆయన వివరించారు. సీఆర్పీఎఫ్ యెల్లో బుక్ లో ప్రస్తావించిన ప్రొటోకాల్స్ ను ఆ సమయంలో రాహుల్ ఉల్లంఘించారని జూనే తెలిపారు.