రానున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎలక్షన్లే టార్గెట్ గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కన్యాకుమారి నుంచి కశ్మీర్కి ఓ విడత పాదయాత్రగా 'భారత్జోడో' ని చేపట్టి పబ్లిక్ ని ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు జోడో వర్షన్ 2.0 అని వస్తున్నారు.
ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. యాత్ర రెండో విడత గుజరాత్ లోని పోర్బందర్ నుంచి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ యాత్ర గుజరాత్నుంచి త్రిపుర రాజధాని అగర్తల వరకు జరగనుంది.
ఇదే అంశాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ఆధ్వర్యంలో ఆ పార్టీ కమిటీ గత వారం చర్చించింది. రానున్నది మొత్తం ఎన్నికల కాలం కావడంతో దానికి అనుబంధంగా బస్సు యాత్రలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే 2022 సెప్టెంబర్ 7 నుంచి 30 జనవరి 2023 వరకు రాహుల్ గాంధీ భారత్జోడో యాత్రను నిర్వహించారు. ఈ యాత్రతో కర్ణాటకలో అధికారంలోకి రావడంతో పాటు.. తెలంగాణ తదితర రాష్ట్రాల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
దీనితో పాటు ప్రతిపక్షాల ఐక్యత సాధించి 'ఇండియా' కూటమి ఏర్పాటుకు జోడో యాత్ర సహకరించిందని సీనియర్ నేతలు అంటున్నారు. భారత్జోడో రెండో విడత కాంగ్రెస్ని లోక్సభ ఎన్నికలకు సమాయత్తం చేసే సాధనంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.