జాబ్స్ అడిగితే.. జాబిల్లిని చూపిస్తున్నారు: రాహుల్

జాబ్స్ అడిగితే.. జాబిల్లిని చూపిస్తున్నారు: రాహుల్
  • మోడీ సర్కార్ పై రాహుల్ ధ్వజం

లాతూర్: కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజల్ని సమస్యల నుంచి పక్కదారి పట్టిస్తూ కాలం గడుపుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లాతూర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దేశంలో యువత జాబ్స్ కావాలని అడుగుతుంటే.. ప్రభుత్వం చంద్రుడని చూపిస్తోందని చంద్రయాన్-2ను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. ఇస్రోను స్థాపించింది కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పుడు ప్రధాని మోడీ దాన్నుంచి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని అన్నారు రాహుల్.

ప్రభుత్వం సమస్యల్ని పక్కన పెట్టేసి మౌనం వహిస్తోందని, ఆర్టికల్ 370, చందమామ గురించి విపరీతంగా మాట్లాడుతోందని అన్నారు రాహుల్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యల గురించి బీజేపీ మాట్లాడడం లేదని అన్నారు.

తమిళనాడులో జరిగిన ప్రధాని మోడీ – చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఫ్రెండ్లీ మీట్ పై కూడా రాహుల్ అటాక్ కు దిగారు. వారి భేటీలో మేకిన్న ఇండియా కాదు.. మేకిన్ చైనా గురించే చర్చ జరిగిందన్నారు. చైనా అధ్యక్షుడిని డోక్లాం అంశంపై ప్రశ్నించారా అని అడిగారు. మీడియా కూడా బీజేపీకి వంతపాడుతోందన్నారు రాహుల్. దేశంలో 15 మంది కుబేరులకు సంబంధించిన రూ.5.5 లక్షల కోట్ల  రుణాలు మాఫీ అయిపోతున్నా గళం విప్పడం లేదని మీడియాపై విమర్శలు చేశారాయన. రైతు రుణ మాఫీ గురించి, యువతకు ఉద్యోగ కల్పన గురించి మీడియా ప్రభుత్వాన్ని నిలదీయకుండా మౌనంగా ఉందన్నారు.