- ప్రశ్నలు అడుగుతుంటే మోదీ ప్రభుత్వం భయపడుతోంది
- వయనాడ్ లో వరద బాధితుల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన
న్యూఢిల్లీ/కన్నూర్ (కేరళ): శాంతియుతంగా చేపట్టిన నిరసనలను, ఆందోళనలను అణచివేయడానికి ఇది నార్త్ కొరియా కాదని, ఇండియా అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల ఏఐ సమిట్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన షర్ట్లెస్ నిరసనపై పోలీసుల చర్యలను తప్పుబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నార్త్ కొరియాలోని నిరంకుశ పాలనతో పోల్చుతూ గురువారం ‘ఎక్స్’లో విమర్శలు చేశారు. ‘‘శాంతియుత నిరసన అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిది.
కానీ అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా మాట్లాడితే లాఠీలు, కేసులు, జైలు శిక్ష ఈ ప్రభుత్వంలో అమలవుతున్నాయి”అని ఆయన మండిపడ్డారు. దేశానికి హాని కలిగించే అమెరికాతో ట్రేడ్ డీల్కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ శాంతియుతంగా నిరసన తెలిపితే, వారిని దేశ ద్రోహులంటూ అరెస్ట్ చేశారన్నారు. ప్రశ్నలు అడుగుతుంటే మోదీ ప్రభుత్వం భయపడుతున్నదన్నారు. ప్రశ్నలు అడగడం ప్రజాస్వామ్య బలహీనత కాదని, అది బలం అని అన్నారు.
వయనాడ్లో 100 ఇండ్లకు శంకుస్థాపన..
కేరళలోని వయనాడ్లో 2024 వరద బాధితుల కోసం నిర్మిస్తున్న 100 ఇండ్లకు కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘మీరు చాలా కోల్పోయారు. కానీ మీ ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కోల్పోలేదు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులు, భూమి సేకరణ, తదితర టెక్నికల్ సమస్యల వల్ల కొంత ఆలస్యం జరిగింది. త్వరలోనే ఇండ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తాం”అని పేర్కొన్నారు.
ఎప్ స్టీన్ ఫైల్స్ పేరుతో ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్లాక్ మెయిల్ చేసి ట్రేడ్ డీల్పై సంతకం చేయించుకున్నారని రాహుల్ మరోసారి ఆరోపించారు. భారత రైతులను బలిపీఠంపై పెట్టేలా ట్రేడ్ డీల్ ఉందన్నారు. ప్రియాంక మాట్లాడుతూ.. దుర్ఘటన జరిగిన సమయంలో తాను ఎంపీని కానప్పటికీ.. ఇప్పుడు ఈ ప్రాంతానికి ఒక కుటుంబసభ్యురాలిగా మారానన్నారు. వయనాడ్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని పార్లమెంట్లో డిమాండ్ చేశానన్నారు. దీనిపై కేంద్ర హోం మంత్రిని కూడా కలిశానని గుర్తుచేశారు.
ప్రియాంక, నేను గొడవపడ్డాం..
ఇండ్ల శంకుస్థాపన సందర్భంగా రాహుల్ ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. చిన్న విషయంలో గొడవ జరిగి, వయనాడ్కు వచ్చే వరకు తామిద్దరం మాట్లాడుకోలేదన్నారు. ‘‘ఈ మధ్య ఓ విషయంలో గొడవ జరిగి ప్రియాంక నాతో మాట్లాడటం మానేసింది. నిన్న (బుధవారం) అమ్మను చూడటానికి ఇంటికెళ్లాను.
నీ చెల్లెలు ఎలా ఉందని అమ్మ అడిగింది. తను మాట్లాడటం లేదని చెప్పా. తర్వాత మేమిద్దరం వయనాడ్కు పయనమయ్యాం. ఫ్లైట్లో కూడా ప్రియాంక సీరియస్గా కూర్చొని ఉంది. వయనాడ్ రాగానే మాట్లాడింది. వయనాడ్లో ఏదో మ్యాజిక్ ఉంది. అందుకే ఆమె నాతో మాట్లాడింది”అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఎప్స్టీన్ ఫైల్స్లో పేర్లున్నవారు రిజైన్ చేయాలి: ప్రియాంక
ప్రపంచవ్యాప్తంగా 'ఎప్స్టీన్ ఫైల్స్'లో పేర్లు వచ్చిన పబ్లిక్ ఆఫీస్ హోల్డర్లు తమ పదవులకు రాజీనామా చేశారని.. కానీ మన దేశంలో అలాంటి నైతిక బాధ్యత కనిపించడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. గురువారం ఆమె వయనాడ్లో మీడియాతో మాట్లాడారు.
" ఎప్స్టీన్ ఫైల్స్ లో పేర్లున్న ఇతర దేశాల్లోని మంత్రులు, రాయల్ ఫ్యామిలీ సభ్యులు అరెస్ట్ అయ్యారు. తమ పదవులకు రాజీనామా చేసి విచారణను ఎదుర్కొంటున్నారు. మన దేశానికి చెందిన కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నాయి. కానీ, వారు నైతిక బాధ్యతతో ప్రవర్తించడం లేదు. ఎప్స్టీన్తో మెయిల్స్ ఎక్స్ఛేంజ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి" అని అన్నారు.
