ముంబై: మహారాష్ట్రలో గిరిజన విద్యార్థులు చేపట్టిన పోరాటం కేవలం చదువు, ఉద్యోగాల కోసం మాత్రమే కాదని.. ఇది వారి అస్తిత్వం కోసం సాగుతున్న పోరాటమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నాసిక్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను రాహుల్ గాంధీ బుధవారం స్వయంగా కలిశారు. వారి సమస్యలను, డిమాండ్లను శ్రద్ధగా విన్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వీడియోను శుక్రవారం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు.
విద్య అనేది ఎవరికీ ప్రత్యేక హక్కు కాదని, దేశంలోని ప్రతి విద్యార్థి ప్రాథమిక హక్కు అని రాహుల్ పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యానికి గురికాకూడదని అభిప్రాయపడ్డారు. రెసిడెన్షియల్ స్కూళ్ల దుస్థితిని ఎదిరించి, తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడుతున్న గిరిజన విద్యార్థులను ఆయన అభినందించారు.‘ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆదివాసీలను వనవాసీలుగా మార్చాలని చూస్తున్నాయి. గిరిజనుల హక్కుల పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీ, నేను అండగా ఉంటాం. ప్రతి విద్యార్థికి గౌరవప్రదమైన, సేఫ్ వాతావరణంలో చదువుకునే హక్కు ఉంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
