కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత ఢిల్లీలోని తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్సభ సెక్రటేరియట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇల్లు ఖాళీ చేయాలన్న నోటీసుకు కట్టుబడి ఉంటానని ఆయన లోక్సభ సెక్రటేరియట్ కు లేఖ రాశారు. "గత నాలుగు సార్లు లోక్సభకు ఎన్నికైన సభ్యునిగా, నేను ఇక్కడ గడిపిన ఆనందకరమైన జ్ఞాపకాలకు ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నాను" అని రాహుల్ గాంధీ లేఖలో తెలిపారు. నా హక్కులకు భంగం కలగకుండా, మీ లేఖలో ఉన్న వివరాలకు కట్టుబడి ఉంటాను అని స్పష్టం చేశారు. ఈ లేఖను లోక్సభ సెక్రటేరియట్ ఎంఎస్ బ్రాంచ్ డిప్యూటీ సెక్రటరీకి ఫార్వార్డ్ చేశారు
రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు పడిన రెండు రోజుల్లోనే కేంద్రం మరో కీలక నిర్ణయాన్ని వెలువరించింది. వయనాడ్ నియోజకవర్గం ఎంపీగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి కేటాయించిన ఇంటిని ఖాళీ చేయాలంటూ లోక్ సభ హౌసింగ్ ప్యానెల్ మార్చి 28న నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 23లోగా తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. రాహుల్ గాంధీ 2004లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి మొదటి సారి లోక్సభ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆయనకు ఢిల్లీలో తుగ్లక్ రోడులో ఇల్లును కేటాయించారు. అదే ఇంట్లో రాహుల్ ఇప్పటివరకు కొనసాగుతున్నారు.