
- తెలంగాణ జన గర్జన’ పేరిట ఖమ్మంలో పబ్లిక్ మీటింగ్
- ఇయ్యాల్టితో ముగియనున్న 1,360 కిలోమీటర్ల భట్టి పాదయాత్ర
- 150 ఎకరాల్లో సభా వేదిక.. సాయంత్రం 5.30 గంటలకు వేదిక వద్దకు రాహుల్
హైదరాబాద్/ఖమ్మం, వెలుగు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదివారం ఖమ్మంలో ముగియనుంది. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఆర్ గ్రౌండ్స్లో 150 ఎకరాల్లో ‘తెలంగాణ జన గర్జన’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సభకు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్గాంధీ హాజరుకానున్నారు.
ఈ మీటింగ్కు పెద్ద ఎత్తున జనం వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కో ఆర్డినేటర్లనూ నియమించారు. స్వయంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధు యాష్కీ గౌడ్ తదితరులు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారు. ఖమ్మం సభ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. రాహుల్ గాంధీ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఏపీలోని గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి సాయంత్రం 5.30 గంటలకు వస్తారు. అనంతరం సభలో ఆయన
ప్రసంగిస్తారు. రాత్రి 7.30 గంటలకు రోడ్డు మార్గంలో గన్నవరానికి తిరుగు పయనమవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.
1,360 కిలో మీటర్లు నడిచిన భట్టి
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మూడు నెలల కింద ఆదిలాబాద్ జిల్లాలో ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ప్రారంభించి శనివారం నాటికి రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,360 కిలో మీటర్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే పాదయాత్రకు గుర్తుగా ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు దగ్గర పైలాన్ను ఆవిష్కరించారు. ఈ యాత్ర ఆదివారం ఖమ్మంలో ముగియనుంది.
రేవంత్తో బోసు రాజు భేటీ
రాహుల్ గాంధీ ఖమ్మం పర్యటన సందర్భంగా ఏఐసీసీ రాష్ట్ర మాజీ ఇన్చార్జ్ సెక్రటరీ, కర్నాటక మంత్రి బోసు రాజు శనివారం హైదరాబాద్కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ సంగిశెట్టి జగదీశ్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి బోసు రాజు వెళ్లారు. ఆయన్ను రేవంత్ శాలువాతో సత్కరించారు. కొద్దిసేపు వారిద్దరూ భేటీ అయ్యారు. ఖమ్మం సభ ఏర్పాట్లు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్
మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి వెళ్తూనే.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వంటి ముఖ్య నేతలు పార్టీ ప్రోగ్రెస్పై నేరుగానే చర్చిస్తున్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న సభల్లోనూ పాల్గొంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న మంచిర్యాలలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఆ తర్వాతి నెలలోనే (మే 8న) ప్రియాంక గాంధీ నిరుద్యోగ గర్జన సభలో పాల్గొన్నారు. ‘
నిరుద్యోగ డిక్లరేషన్’ను ప్రకటించారు. నిరుడు నుంచి రాహుల్గాంధీ వరుసగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. నిరుడు మే 6న వరంగల్లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ఆయన పాల్గొన్నారు. అదే వేదికగా రైతు డిక్లరేషన్ను ప్రకటించారు. ఆ తర్వాత ఆరు నెలల్లోనే మరో రెండు సభలను రాష్ట్రంలో నిర్వహించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా అక్టోబర్ 30న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్, నవంబర్ 7న సంగారెడ్డి శివ్వంపేటలో బహిరంగ సభలను నిర్వహించారు. ఇప్పుడు ఖమ్మం సభలో పాల్గొననున్నారు.