కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2023 మే 22 సోమవారం రాత్రి హర్యానాలోని ఓ ట్రక్కులోఎక్కి అంబాలా నుంచి చండీగఢ్ వరకు 50 కిలోమీటర్లు ప్రయాణించారు. కాంగ్రెస్ నేత ఇమ్రాన్ ప్రతాప్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లారీ డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవాడానికి రాహుల్ గాంధీ వారి మధ్యకు చేరుకుని వారితో ప్రయాణించారని ఇమ్రాన్ ప్రతాప్ తన ట్వీట్ లో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి సిమ్లాకు బయలుదేరారు. అనుకోకుండా దారి మధ్యలో లారీలు భారీ సంఖ్యలో వెళ్లటం గమనించారు రాహుల్. వారి సమస్యలు ఏంటీ.. లారీ డ్రైవర్ల జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటానికి ఉత్సాహపడ్డారు రాహుల్. అనుకున్నదే తడవుగా.. దారి మధ్యలో ఓ లారీ ఆపారు. కారు దిగి లారీ ఎక్కారు. దారిలో అంబాలా నుంచి చండీగఢ్కు ట్రక్కులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో రాహుల్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంబాలా చేరుకున్న తర్వాత రాహుల్ గాంధీ రోడ్డు మార్గంలో హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా వైపు వెళ్లారు.
దేశంలోని చిన్న వర్గాల ప్రజలతో మమేకమయ్యేందుకు రాహుల్ గాంధీ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా బెంగళూరులో డెలివరీ బాయ్తో కలిసి స్కూటర్పై ప్రయాణించారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్ లో కూడా సాధారణ వ్యక్తిగా ప్రయాణించారు రాహుల్.