అక్టోబర్ 24న తెలంగాణలో ఎంటర్ కానున్న 'భారత్ జోడో యాత్ర'

అక్టోబర్ 24న తెలంగాణలో ఎంటర్ కానున్న 'భారత్ జోడో యాత్ర'

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర అక్టోబర్ 24న తెలంగాణలో ఎంటర్ కానుంది. ఇందుకు రూట్ మ్యాప్ ఫైనల్ అయ్యింది.  రాష్ట్రంలో మొత్తం 13రోజుల పాటు 359కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ. మొదటి రోజు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ లోని కృష్ణ గ్రామం దగ్గర రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు రాహుల్. ఆతర్వాత రెండో రోజు దేవరకద్ర  నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడో రోజు మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో.. 4వ రోజు జడ్చర్ల లో పాదయాత్ర చేస్తారు. 5వ రోజు షాద్ నగర్, ఆరో రోజు శంషాబాద్ ప్రాంతంలో జరిగే పాదయాత్రలో పాల్గొంటారు.

ఆతర్వాత 7వ రోజు శేరిలింగంపల్లి, 8వ రోజు పటాన్ చెరు నియోజకవర్గంలో రాహుల్  జోడో యాత్ర సాగనుంది. 9వ రోజు సంగారెడ్డి, పదవ రోజు సంగారెడ్డి జిల్లా జోగిపేట.. 11 వ రోజు నాడు శంకరం పేటలో పర్యటించనున్నారు.  చివరి రెండు రోజులు జుక్కల్ లోనే పాదయాత్ర  చేయనున్నారు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనలని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ పాదయాత్ర అనుమతి కోసం శనివారం డీజీపీని కలువనున్నామని చెప్పారు.