మట్టి కప్పుల్లో చాయ్
ప్లాస్టిక్ కప్పులకు రైల్వే నో
జైపూర్: రైల్వే స్టేషన్లలో ఇకపై మట్టి కప్పుల్లోనే చాయ్ అమ్మాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఆదివారం వెల్లడించారు. ప్లాస్టిక్ కప్పుల ద్వారా పర్యావరణానికి కలిగే హానిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తొలుత దేశవ్యాప్తంగా ఉన్న 400 రైల్వే స్టేషన్లలో ప్రారంభించి, క్రమంగా అన్ని స్టేషన్లలోనూ అమలు చేస్తామని మంత్రి వివరించారు. ఈమేరకు రాజస్థాన్లోని అల్వార్ జిల్లా దిగావర రైల్వే స్టేషన్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కప్పులలో చాయ్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని, పర్యావరణానికి కూడా ఈ కప్పులతో హాని తప్పదని అన్నారు. పేపర్ కప్పులు కూడా మంచిది కాదని ఇటీవలి రీసెర్చ్లో తేలిందన్నారు. ఈ క్రమంలో ఇటు ఆరోగ్యానికి, అటు ఎన్విరాన్మెంట్కు మేలు చేసే మట్టి కప్పులను ఉపయోగించడమే మేలన్నారు. ఈ మట్టి కప్పుల తయారీ ద్వారా వేలాది మందికి ఉపాధి కూడా దొరుకుతుందని మంత్రి గోయెల్ వివరించారు.
For More News..