ముంబైని ముంచెత్తుతున్న వాన

ముంబైని ముంచెత్తుతున్న వాన
  • రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావారణ శాఖ
  • 10 గంటల్లోనే 23సెం.మీ. వర్షం
  • లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం

ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైని వానలు ముంచెత్తాయి. 10 గంటల్లోనే 23 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముంబై, థానే, రాయ్‌గడ్‌, రత్నగిరి తదితర ప్రాంతాల్లో మోక్కాళ్ల లోతు వరకు నీరు వచ్చి చేరింది. దీంతో ముంబైలో అధికారులు రెడ్‌ అలర్డ్‌ ప్రకటించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. వర్షాలకు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. నగరంలోని చాలా ప్రాంతాలకు బస్సులు, లోకల్‌ రైలు సర్వీసులను నిలిపేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని అధికారులు ప్రకటించారు. నగరంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదిత్య థాక్రే ట్వీట్‌ చేశారు. 2005 తర్వాత ఇంత వర్షపాతం నమోదవడం ఇదే అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరో రెండు రోజులపాటు భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పారు.