
- కేసును ఛేదించిన పోలీసులు
ముస్తాబాద్, వెలుగు: కొడుకు చేసిన అప్పు డబ్బులు ఇవ్వాలని తండ్రిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం ఎస్సై గణేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం..
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరుకు చెందిన జంపెల్లి మల్లయ్య (72) కుమారుడు పరుశురాములు గల్ఫ్ లో అతడి స్నేహితుడైన బోయిన రాజేందర్ వద్ద రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించకుండా పరుశరాములు విదేశాల్లో ఉండటంతో విసుగు చెందిన రాజేందర్ అతడి స్నేహితులు కలకోట రవి, సందడికారి సతీశ్మూడు రోజుల కింద గూడూరులోని అతడి ఇంటికి వెళ్లారు. దీంతో తన కొడుకు ఇంట్లో లేడని, బతుకుదెరువు కోసం మలేషియా వెళ్లాడని మల్లయ్య వారికి చెప్పాడు.
అనుకున్న ప్లాన్ ప్రకారం వారు మల్లయ్యని కిడ్నాప్ చేయగా, అతడి భార్య జంపెల్లి మల్లవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఎస్సై గణేశ్, ఆయన నేతృత్వంలో కానిస్టేబుల్స్ రాజశేఖర్, కాశీంతో కలిసి కాల్ డేటా, సిగ్నల్స్ ఆధారంగా బుధవారం కిడ్నాపర్లను పట్టుకుని మల్లయ్యను విడిపించారు. ఈ మేరకు కిడ్నాపర్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.