- ఏర్పాటవుతాయన్న ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్
- టవర్ సెమీకండక్టర్స్, టాటా గ్రూప్ పెట్టుబడులు
- ఓకే అయ్యాయని వెల్లడి
న్యూఢిల్లీ: త్వరలో రెండు పూర్తి స్థాయి చిప్ల తయారీ ప్లాంట్లు ఇండియాలో ఏర్పాటు కానున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ రెండింటికి తోడు మరికొన్ని సెమీకండక్టర్ అసెంబ్లింగ్, ప్యాకేంజింగ్ ప్లాంట్లు కూడా ఇండియాకు రానున్నాయని చెప్పారు. ఇజ్రాయిల్ కంపెనీ టవర్ సెమీకండక్టర్స్ దేశంలో 8 బిలియన్ డాలర్లు (రూ.66,400 కోట్లు) పెట్టుబడి పెట్టనుందని నిర్ధారించారు.
టాటా గ్రూప్ కూడా చిప్ల తయారీ కంపెనీ పెట్టనుందని అన్నారు. ఈ గ్రూప్ అస్సాంలో సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్ పెట్టనుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ‘రెండు పూర్తి స్థాయి చిప్ల తయారీ ప్లాంట్లు త్వరలో ఏర్పాటు కానున్నాయి. మల్టీ బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్లాంట్లలో 65, 40, 28 నానోమీటర్ చిప్లు తయారవుతాయి. వీటికి తోడు మరికొన్ని చిప్ ప్యాకేజింగ్, అసెంబ్లింగ్కు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చాయి.
వీటిని పరిశీలిస్తున్నాం’ అని చంద్రశేఖర్ వివరించారు. టవర్ సెమీకండక్టర్ ప్రపోజల్ సబ్మిట్ చేసిందా? అనే ప్రశ్నకు సమాధానంగా ఆయనీ వివరణ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్కు జనరల్ ఎలక్షన్స్కు ముందే అనుమతులు ఇస్తామని, లేకపోతే మోదీ ప్రభుత్వం మూడో టెర్మ్లో అనుమతులు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ‘మీరు ప్రస్తావించిన కంపెనీలు కీలకమైన, పెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ చేశాయి. మరోవైపు టాటా గ్రూప్ కూడా సెమీకండక్టర్ ప్లాంట్ పెట్టనుంది. ఇవి చాలా తొందరలోనే వాస్తవ రూపంలోకి రానున్నాయి’ అని చంద్రశేఖర్ అన్నారు.
భారీ రాయితీలతో..
సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్ పెట్టేందుకు ప్రభుత్వం నాలుగు ప్రపోజల్స్ను అందుకుంది. మరో 13 చిప్ అసెంబ్లీ, టెస్టింగ్, మానిటరింగ్, ప్యాకేంజింగ్ (ఏటీఎంపీ) యూనిట్లకు సంబంధించి ప్రపోజల్స్ అందుకుంది. ఈ ప్రపోజల్స్ గుజరాత్లో యూఎస్ కంపెనీ మైక్రాన్ పెట్టుబడులకు అదనం. కాగా, సెమీకండక్టర్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం రూ.76 వేల కోట్ల విలువైన రాయితీలను ఇవ్వాలని నిర్ణయించుకుంది.
ఇందులో భాగంగా ఏదైనా కంపెనీ ఇండియాలో చిప్ల తయారీ ప్లాంట్ పెడితే ప్రాజెక్ట్లో 50 శాతం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మైక్రాన్, టాటా ఎలక్ట్రానిక్స్, కేన్స్ కార్పొరేషన్ ఇండియాలో చిప్ల తయారీ ప్లాంట్ పెడతామని ప్రకటించాక చాలా కంపెనీలు ఈ సెక్టార్లోకి ఎంట్రీ ఇస్తామని అనౌన్స్ చేశాయి. హెచ్సీఎల్ గ్రూప్, మురుగప్ప గ్రూప్ ఇందులో ఉన్నాయి.
యూపీఏ సెమీకండక్టర్ల సెక్టార్ను పట్టించుకోలేదని చంద్రశేఖర్ ఆరోపించారు. ‘ ఇండియాలో ప్లాంట్ పెట్టడానికి 2012 లో ఇంటెల్ ఆసక్తి చూపించింది. కానీ ఎటువంటి సపోర్ట్ దొరకకపోవడంతో వారు దేశం వదిలి వెళ్లిపోయారు’ అని అన్నారు. యూపీఏ 75 ఏళ్ల పాలనలో వదిలేసిన అవకాశాలను, సమయాన్ని అందుకోవాలంటే వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తమకు తెలుసన్నారు.
సెమీకండక్టర్, డిజైన్, స్టార్టప్, రీసెర్చ్, ట్యాలెంట్, ప్యాకేంజింగ్, ఫ్యాబ్రికేషన్ వంటి సెగ్మెంట్లలో మంచి గ్రోత్ నమోదు చేశామని చెప్పారు. ప్రభుత్వ డేటా ప్రకారం, దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ గత పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగి రూ.8.22 లక్షల కోట్లకు చేరుకుంది. 2013–14 లో లోకల్గా ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ రూ.1,80,454 కోట్లు (29.8 బిలియన్ డాలర్లు) ఉండగా, 2022–23 నాటికి ఈ నెంబర్ రూ.8,22,350 కోట్ల (102 బిలియన్ డాలర్ల) కు పెరిగింది. 2026 నాటికి ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ తయారీ రూ.23,95,195 కోట్లకు (300 బిలియన్ డాలర్లకు) చేరుకుంటుందని అంచనా.