
హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి విశాఖపట్నం మీదుగా పూణెకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఓఆర్ఆర్ దగ్గర రాజేంద్రనగర్ జోన్ ఎస్.ఓ.టి పోలీసులు పట్టుకున్నారు. ఐదు మంది మగవాళ్లతో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..
రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ మీడియాకు చెప్పిన వివరాల ప్రకారం.. పూణేకి చెందిన ప్రశాంత్ గణేష్,లత గణేష్ జాదవ్, సచిన్ దిలీప్, రోహన్, రాహుల్ బాబురావు, గౌరవ్ నాటేకర్ లు ఒక ముఠాగా ఏర్పడి రెండు కార్లలో ఒడిశా నుంచి పుణెకు గంజాయిని రాజేంద్రనగర్ అవుటర్ రింగ్ రోడ్డు నుంచి తరలిస్తున్నారు.
పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ జోన్ ఎస్ఓటి పోలీసులు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 17దగ్గర గంజాయి తరలిస్తున్న రెండు కార్లను పట్టుకుని నిందితులను అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి రెండు కార్లు, 60 లక్షల విలువచేసే 108 కేజీల గంజాయి,6 సెల్ ఫోన్లు, రూ. 9,700 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ప్రశాంత్ గణేష్, సచిన్ దిలీప్, రాహుల్ బాబురావు,గౌరవ్ నాటేకర్ నేరచరిత్ర కలిగి ఉన్నారని మహారాష్ట్రలో కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
►ALSO READ | మయన్మార్లో మఠంపై దాడి..23 మంది మృతి
హైదరాబాద్ లో డ్రగ్స్, గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడిక్కడ తనిఖీలు చేసి అరెస్ట్ చేస్తోంది. అయినా కొందరు అక్రమంగా సిటీలోకి గంజాయి, డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. ఇలాంటి వారిపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.