
హైదరాబాద్, వెలగు: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులై మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించేందుకు సింగరేణి సంస్థ ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జూన్ 23 నుంచి www.scclmines.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సీఎండీ ఎన్. బలరామ్ సూచించారు. ఈ పథకం కింద మెయిన్స్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందజేస్తామన్నారు.
ఈసారి సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా రూ. లక్ష చొప్పున సాయం అందిస్తామని తెలిపారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులతో గతేడాది ప్రారంభమైన ఈ పథకం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. గతేడాది 140 మంది మెయిన్స్కు అర్హత సాధించగా..అందులో 20 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని వివరించారు. ఇంటర్వ్యూలకు హాజరైనవారికి అదనంగా రూ.1 లక్ష ఇచ్చామన్నారు.