టీఎస్ఆర్టీసీ ఆల్ టైం రికార్డు.. రాఖీ పండగకి రూ. 22. 65 కోట్ల రాబడి

టీఎస్ఆర్టీసీ ఆల్ టైం రికార్డు.. రాఖీ పండగకి రూ. 22. 65 కోట్ల రాబడి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చరిత్రలో ఆల్ టైం రికార్డుగా నిలిచింది. టీఎస్ఆర్టీసీకి రాఖీ పౌర్ణమి పండగ నాడు రూ.22.65 కోట్ల రాబడి వచ్చింది. రాఖీ పండగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 40.92 లక్షల మందిని ఆర్టీసీ క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసింది. గత ఏడాది కన్నా ఈ  సంవత్సరం అదనంగా లక్ష మంది రాకపోకలు సాగించారు. ఒకే రోజు ఇంత పెద్ద ఎత్తున ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

చరిత్రలో ఒక్క రోజు

ప్రజా రవాణా వ్యవస్థ వెంటే.. మేమున్నామని ప్రజలు మరోసారి నిరూపించారని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమికి కూడా సంస్థకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. ఒక్క రోజులో దాదాపు 41 లక్షల మంది ప్రయాణికులు సంస్థ బస్సుల్లో రాకపోకలు సాగించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సంస్థ తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రజల ఆదరణ, పోత్సాహం వల్ల ఎన్నో రికార్డులు నమోదయ్యాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీల చరిత్రలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రాలేదన్నారు.

ఉమ్మడి నల్గొండ టాప్

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 104.68 శాతం ఓఆర్ నమోదయిందని చేసిందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. నిన్న(ఆగస్టు 31) ఒక్క రోజే టీఎస్ఆర్టీసీకి రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చిందని... ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు అని పేర్కొన్నారు. గత ఏడాది రాఖీ పండుగ(12.08.2022) నాడు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ ఏడాది దాదాపు రూ. కోటి వరకు అదనపు ఆదాయం ఆర్జించిందని చెప్పారు. 

20 డిపోల్లో 100 శాతం

గత ఏడాది రాఖీ పండుగతో పోల్చిస్తే, ఈ సంవత్సరం 1.23 లక్షల కిలోమీటర్లు అదనంగా ఆర్టీసీ బస్సులు తిరిగాయని పేర్కొన్నారు. గత సంవత్సరం 35.54 లక్షల కిలోమీటర్లు తిరగగా.. ఈ ఏడాది టీఎస్ఆర్టీసీ బస్సులు 36.77 లక్షల కిలో మీటర్లు నడిచాయన్నారు. 20 డిపోల్లో 100 శాతానికి పైగా (ఓఆర్) ఆక్యూపెన్సీ రేషియా విషయానికి వస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా గత ఏడాది రికార్డును పునరావృతం చేసిందని తెలిపారు. 

2022లో టీఎస్ఆర్టీసీ రాఖీ పండుగ నాడు 101.01 ఓఆర్ సాధించగా.. ఈ సారి 104.68 శాతం రికార్డు ఓఆర్ నమోదు చేసిందని అధికారులు పేర్కొన్నారు. ఆ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో నార్కెట్ పల్లి మినహా మిగతా డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయని.. నల్లగొండ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో 97.05 శాతం ఓఆర్ నమోదైందని పేర్కొన్నారు. ఆ జిల్లాలో 9 డిపోలు ఉండగా.. 6 డిపోలు 100కిపైగా ఓఆర్ సాధించడం విశేషం. అలాగే, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓఆర్ నమోదైందని తెలిపారు. 

రాఖీ పౌర్ణమి నాడు రాష్ట్రంలోని 20 డిపోల్లో ఓఆర్ 100 శాతానికి పైగా దాటిందని ఎండీ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు. ఆయా డిపోల్లో బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోయాయన్నారు. హుజురాబాద్, నల్లగొండ, భూపాలపల్లి, హుస్నాబాద్, పరకాల, కల్వకుర్తి, తొర్రూర్, మహబుబాబాద్, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరిగుట్ట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, కోదాడ, నర్సంపేట, సూర్యాపేట, దుబ్బాక, జనగామ, సిద్దిపేట, గోదావరిఖని, షాద్ నగర్ డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయని చెప్పారు. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో అత్యధికంగా కిలోమీటర్ కు రూ.65.94ను వరంగల్-1 డిపో, రూ.65.64ను భూపాలపల్లి డిపో సాధించిందని అన్నారు. గత ఏడాది రాఖీ నాడు 12 డిపోలు మాత్రమే 100 శాతానికిపైగా ఓఆర్ సాధించగా.. ఈ సారి 20 డిపోలు నమోదు చేశాయని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. 

ఉద్యోగులకు  కృతజ్ఞతలు

రాఖీ పండుగ నాడు ఎంతో నిబద్దతతో సిబ్బంది పనిచేశారని, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు రాఖీ పండుగ రోజును త్యాగం చేసి మరీ విధులు నిర్వర్తించారని గుర్తు చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి.. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారని చెప్పారు. ఎంతో మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను మొచ్చకుంటూ తమకు, ఉన్నతాధికారులకు సందేశాలు పంపించారని పేర్కొన్నారు. 

ప్రజలందరూ పండుగలు చేసుకుంటుంటే.. సంస్థ సిబ్బంది మాత్రం విధుల్లో నిమగ్నై వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చరని అధికారులు తెలిపారు. ఈ రికార్డు కోసం రాత్రి పగలు తేడా లేకుండా సిబ్బంది పని చేశారన్నారు. సంక్రాంతి, రాఖీ పౌర్ణమి, దసరా, తదితర ప్రధాన పండుగల్లో సిబ్బంది త్యాగం ఎనలేనిదని.. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతల తెలిపారు. ప్రజల ఆదరణ, ప్రోత్సాహన్ని స్పూర్తిగా తీసుకుని రెట్టింపు ఉత్సాహంతో పని చేసి భవిష్యత్ లో కూడా మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలందించాలని కోరారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ నమ్మకాన్ని కొల్పోకుండా మంచి ఫలితాలు వచ్చేలా పాటుపడాలని పిలుపునిచ్చారు.