- మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఆర్సీపురంలో సర్ అవగాహన సదస్సుకు హాజరు
రామచంద్రాపురం, వెలుగు: కాంగ్రెస్ కార్యకర్తలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని మంత్రి వివేక్ వెంకట స్వామి సూచించారు. పటాన్చెరు లాంటి ఇండస్ట్రియల్ ఏరియాల్లో సెటిలర్స్ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ఓట్లు ఒకే దగ్గర ఉండేలా చూడాలన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో సర్పై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మంత్రి వివేక్ బీఎల్ఓలతో మాట్లాడి, సర్ ప్రక్రియపై సమీక్షించారు.
అనంతం మంత్రి వివేక్ మాట్లాడుతూ... సర్ ప్రక్రియలో టెక్నికల్ అంశాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఫామ్ 6, 7, 8లపై బీఎల్ఓలకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)తో రాష్ట్రంలో దాదాపు 90 లక్షల ఓట్లు తొలగిపోయే అవకాశం కనిపిస్తోందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రతి ఓటరును కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. పటాన్చెరు నియోజకవర్గంలో 70 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని, సర్తో అవన్నీ తొలగిస్తారని పటాన్చెరు కాంగ్రెస్ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాట సుధారాణి, పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనీల్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల, మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం తదితరులు పాల్గొన్నారు.
