- ఐక్యత కోసమా...? అసంతృప్తిని తెలిపేందుకా...?
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్లోని 30 మంది కార్పొరేటర్లు పార్టీలకతీతంగా బుధవారం మేడారం టూర్కు తరలివెళ్లారు. 20 మంది కాంగ్రెస్, ఎనిమిది మంది బీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ నుంచి ఒక్కొక్కరి చొప్పున ఈ టూర్లో పాల్గొన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు ముగిసి (మేయర్, డిప్యూటీ మేయర్ మినహా) 58 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తమకు సరైన గౌరవం దక్కడం లేదని, ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని, ప్రజా సమస్యలపై ఇచ్చే వినతులను అధికారులు పట్టించుకోవడం లేదనే అసంతృప్తిలో ఉన్నారు. ఆఫీస్లో కార్పొరేటర్లు కూర్చోవడానికి, చర్చించుకోవడానికి కనీసం వెయిటింగ్ హాల్ కూడా లేకపోవడం, కమిషనర్, మేయర్ డివిజన్ల పర్యటనకు వచ్చిన సందర్భంలో సమాచారం ఇవ్వకపోవడం, తదితర అంశాలపై కార్పొరేటర్లు తమదైన పద్దతిలో నిరసన తెలుపుతూ వస్తున్నారు.
ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలీలో నిర్వహించిన శిక్షణకు మెజార్టీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. కాగా పార్టీలకతీతంగా రామగుండం కార్పొరేటర్లు మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జాతరకు బుధవారం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కార్పొరేటర్లు మాత్రం కేవలం అమ్మవార్ల దర్శనానికి వెళ్లామని పైకి చెబుతున్నా...తామంతా ఐక్యంగా ఉన్నామనే సంకేతాన్ని పాలకవర్గం దృష్టికి తీసుకువస్తూ తమ అసంతృప్తిని తెలిపేందుకు ఈ టూర్ చేసినట్టు స్పష్టమవుతున్నది.
