- రామగుండం కాంగ్రెస్ చేతికి.. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీకి..
- 9 మున్సిపాలిటీలు కాంగ్రెస్, 3 బీఆర్ఎస్ కైవసం
- సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఎన్నిక నేటికి వాయిదా
- రాయికల్లో కాంగ్రెస్ మద్దతుతో చైర్పర్సన్ దక్కించుకున్న బీఆర్ఎస్
కరీంనగర్/పెద్దపల్లి/జగిత్యాల/సిరిసిల్ల, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. చొప్పదండి, హుజూరాబాద్, ధర్మపురి, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, వేములవాడ, పెద్దపల్లి, మంథని మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. సిరిసిల్ల, రాయికల్, జమ్మికుంటలను బీఆర్ఎస్ చేజిక్కించుకుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను బీజేపీ దక్కించుకోగా.. రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లను కాంగ్రెస్ వశం చేసుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయా పార్టీల క్యాంపుల్లో ఉన్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సోమవారం నేరుగా ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు చేరుకొని ఓటింగ్లో పాల్గొన్నారు.. . సుల్తానాబాద్ మున్సిపాలిటీలో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక మంగళవారానికి వాయిదాపడింది.
కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్
రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు(9 మంది) తటస్థంగా ఉండడంతో బీజేపీకి మార్గం సులువైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రాత్రే హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్ లో క్యాంపు వేసిన 30 మంది బీజేపీ కార్పొరేటర్లు, ముగ్గురు ఇండిపెండెంట్లతో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం ఉదయం కరీంనగర్ చేరుకున్నారు. అలాగే క్యాంపులో ఉన్న 14 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు, ముగ్గురు ఎంఐఎం, నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు ఏఐఎఫ్బీ కార్పొరేటర్లు మరో బస్సులో చేరుకున్నారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ల పరోక్ష ఎన్నిక కొనసాగింది.
బండి సంజయ్ కుమార్ ఎక్స్ అఫీషియో మెంబర్గా హాజరై తమ ఓటును వినియోగించుకున్నారు. మేయర్గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా యాదగిరి సునీల్ రావు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి మేయర్ అభ్యర్థిగా ఆకుల నర్మద, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా హీనా అఫ్రీన్ పోటీలో ఉండగా.. నర్మదకు 14 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు, ముగ్గురు ఇండిపెండెంట్లు, 3 ఎంఐఎం సభ్యులు, ఒక ఫార్వర్డ్ బ్లాక్ సభ్యురాలు ఓటేయగా మొత్తం 21 ఓట్లు వచ్చాయి. అనంతరం కొలగాని శ్రీనివాస్కు 30 మంది బీజేపీ కార్పొరేటర్లు, ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ ఓటేయడంతో 34 ఓట్ల మద్దతుతో మేయర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థి యాదగిరి సునీల్ రావుకు కూడా 34 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికకు ఎక్స్ అఫీషియో మెంబర్లయిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరుకాలేదు.
హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా రొంటాల సుహాసిని(కాంగ్రెస్), వైస్ చైర్పర్సన్గా గూడూరి అంజలి(కాంగ్రెస్), చొప్పదండి చైర్పర్సన్గా వడ్లూరి సరిత(కాంగ్రెస్), వైస్ చైర్ పర్సన్గా పెరుమాండ్ల మానస(కాంగ్రెస్) ఎన్నికయ్యారు. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం రావడంతో ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 4, బీజేపీ 8, ఇద్దరు ఇండిపెండెంట్స్ గెలిచారు. కాంగ్రెస్కు ఇద్దరి ఇండిపెండెంట్స్ మద్దతు ఉండడంతోపాటు మరో బీఆర్ఎస్ కౌన్సిలర్ చేరడంతో ఆ పార్టీ బలం 16కు చేరింది. స్థానిక ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్ ఎక్స్అఫీషియో ఓటుతో పుల్కం రాజు చైర్పర్సన్గా, వైస్ చైర్మన్గా నరాల రాజు ఎన్నికయ్యారు.
జమ్మికుంటలో హైడ్రామా..
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో ఇండిపెండెంట్ కౌన్సిలర్ మొలుగు ప్రశాంత్ కుమార్ కైవసం చేసుకున్నారు. జమ్మికుంటలో 30 వార్డులుండగా బీఆర్ఎస్ 12 , కాంగ్రెస్ 10 , బీజేపీ 4 , ఇండిపెండెంట్లు 3, ఒక్కరు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి గెలుచుకున్నారు. అయితే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మూడు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ క్యాంపులు నిర్వహించాయి. సోమవారం తెల్లవారుజాము వరకు కాంగ్రెస్ క్యాంపులో ఉన్న ఇండిపెండెంట్ కౌన్సిలర్ మొలుగు ప్రశాంత్ కుమార్.. ఉదయం బీఆర్ఎస్ క్యాంపులో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ , ఇండిపెండెంట్లు మున్సిపల్ ఆఫీసుకు వచ్చారు. బీజేపీ, ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు నలుగురు గైర్హాజరయ్యారు. చివరికి ప్రశాంత్ కుమార్కు కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు పలకడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సిరిసిల్ల వైస్ చైర్మన్ ఎన్నికలో గందరగోళం
సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. మొదటి నుంచి బుర్ర నారాయణగౌడ్(13 వ వార్డు)కు వైస్ చైర్పర్సన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కాగా ఎన్నిక జరిగేటప్పుడు కేటీఆర్ పంపిన సీల్డ్ కవర్లో తన పేరు లేకపోవడంతో ర్ర నారాయణగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలో నాలుగు కాంగ్రెస్.. ఒకటి బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా మున్సిపల్ రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం చాటింది. ఐదు మున్సిపాలిటీల్లో నాలుగు అధికార పార్టీ కైవసం చేసుకోగా, రాయికల్లో మాత్రం కాంగ్రెస్ మద్దతుతో బీఆర్ఎస్ చైర్పర్సన్ ఎన్నియ్యారు.
రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠ రేపిన జగిత్యాల చైర్పర్సన్ ఎన్నికలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి చెందిన సమిండ్ల వాణి భారీ మెజార్టీతో విజయం సాధించగా, వైస్ చైర్మన్ పదవి జీవన్ రెడ్డి వర్గం గెలుచుకుంది. రాయికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో, కాంగ్రెస్, -ఇండిపెండెంట్ల మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థి కట్కం రవీందర్ చైర్ పర్సన్గా ఎన్నికయ్యారు. ధర్మపురి, మెట్పల్లి, కోరుట్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తూ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు కైవసం చేసుకుంది. ధర్మపురిలో వేముల నాగలక్ష్మి, మెట్పల్లిలో మైలారపు లింబాద్రి, కోరుట్లలో తిరుమల వసంత చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు.
చివరి వరకు ఉత్కంఠ.
మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగి, ఒక్క బీజేపీ కౌన్సిలర్ క్రాస్ ఓటుతో కాంగ్రెస్ సంచలన విజయం నమోదు చేసింది. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ నాలుగు ఇండిపెండెంట్లతోపాటు బీజేపీకి చెందిన చెట్లపల్లి మీనా మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ అభ్యర్థి మైలారపు లింబాద్రి చైర్మన్గా, ఓంకార్ నవీన్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరడంలో నియోజకర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు కీలకంగా వ్యవహరించారు.
పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్..
పెద్దపల్లి/గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని కార్పొరేషన్తో పాటు మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. పెద్దపల్లి చైర్పర్సన్గా నూగిళ్ల మల్లయ్య, వైస్ చైర్పర్సన్గా ముస్కాన్ నాజ్ ఎన్నికయ్యారు. మంథనిలో చైర్పర్సన్గా ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్గా ముస్కుల సహేందర్రెడ్డి ఎన్నికయ్యారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం మంగళవారానికి వాయిదా వేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కాంగ్రెస్ కార్పొరేటర్ మహాంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ అభ్యర్థి పాతపెల్లి ఎల్లయ్య ఎన్నికయ్యారు.
