ఫారెన్ టూర్ లో ఉన్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ స్లోవేనియా చేరుకున్నారు. స్లోవేనియా రాజధాని లుబ్జియానా చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు బొరుట్ పహొర్ ఘనస్వాగతం పలికారు. అధ్యక్ష భవనంలో జరిగిన స్వాగత కార్యక్రమంలో సైనికుల గౌరవవందనం స్వీకరించారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. స్లొవేనియాలో పర్యటిస్తున్న తొలి భారత రాష్ట్రపతి ఆయనే కావడం విశేషం.
ఐస్ లాండ్, స్విట్జర్లాండ్, స్లొవేనియా దేశాలలో ఆయన పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా నిన్న స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పర్యటించారు. అక్కడి నుంచి స్లొవేనియాకు నిన్న మధ్యాహ్నం బయలు దేరారు. ఆ సమయంలో జ్యూరిచ్ విమానాశ్రయంలో ఆయన అధికారిక విమానం ఎయిర్ ఇండియా వన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని సరిచేసిన తర్వాత దాదాపు 3 గంటల ఆలస్యంగా ఆయన విమానం బయలుదేరింది. ఈ ఘటనపై ఎయిరిండియా దర్యాప్తుకు ఆదేశించింది.