హైదరాబాద్, వెలుగు : ‘సిరిసిల్లలో రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక.. ఇంత నీచ స్థాయికి దిగజారుతున్నవా?’ అంటూ బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ మంత్రి కేటీఆర్పై ఫైర్ అయ్యారు. దసరా పండుగ రోజు వేణుస్వామిని కలిసి ఆశ్వీరాదం తీసుకున్న రాణి రుద్రమపై సోషల్ మీడియాలో అధికార పార్టీ కార్యకర్తలు విమర్శలు చేస్తుండడంతో.. గురువారం ఆమె ట్విట్టర్లో మండిపడ్డారు. “నేను తండ్రిలాగా భావించే వ్యక్తి వద్దకు వెళ్లి.. పండుగ పూట జమ్మి చేతిలో పెట్టి ఆశీర్వచనాలు తీసుకుంటే.. మీ చిల్లర చంచా గాల్లతో సోషల్ మీడియాలో వికృత పోస్ట్ లు పెట్టిస్తున్న నీ కుసంస్కరానికి సిరిసిల్ల ప్రజలు బుద్ధి చెప్తారు.
మహిళలపై అరాచకాలు చేసే, అవమానించే మీ దొర దురహంకార అధికార మధానికి సిరిసిల్ల మహిళలు ఓట్ల రూపంలో మిమ్మల్ని ఓడించి సమాధానం చెప్తారు. మహిళలపై ఆకృత్యాలు చేసిన రజాకార్లను, దొరలను తరిమికొట్టిన తెలంగాణ గడ్డ ఇది. చరిత్ర పునరావృతం అయితే మీరు దేశాలు పట్టుకొని పారి పోవలసి వస్తుంది జాగ్రత్త. సోషల్ మీడియా మీకు మాత్రమే లేదు. మా బీజేపీ తమ్ముళ్లు తలుచుకుంటే గాల్లో కొట్టుకుపోతారు మీరు.. గుర్తుంచుకోండి.. ” అని రాణి రుద్రమ హెచ్చరించారు. బీఆర్ఎస్కార్యర్తలు పోస్ట్చేసిన ఫొటోను ఆమె ట్వీట్కు యాడ్ చేశారు.