
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ కు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లిన టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. శుక్రవారం (జూన్ 20) లీడ్స్ వేదికగా.. హెడ్డింగ్లేలో తొలి టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కు భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని మిస్ అవుతుంది. టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ కోహ్లీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు విరాట్ అనుభవం లేకుండానే ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెడుతుంది. కోహ్లీ లేకపోవడంతో సిరీస్ కళ తప్పినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది.
కోహ్లీ గనుక మ్యాచ్ ఇంగ్లాండ్ సిరీస్ కు అందుబాటులో ఉండి ఉంటే ఈమెగా సిరీస్ కు నెక్స్ట్ లెవల్ క్రేజ్ గ్యారంటీగా కనిపిస్తుంది. విరాట్ ఆటను చూడడానికి వేల సంఖ్యలో స్టేడియానికి ప్రేక్షకులు వచ్చేవారు. కానీ ఈ సారి అలా జరగడం కష్టం. ఇదిలా ఉంటే కోహ్లీ టీంఇండియాలో లేకపోయినా భారత జట్టు అతన్ని మిస్ కాదని అశ్విన్ అన్నాడు. ఇటీవల ప్రముఖ జర్నలిస్ట్ బోరియా మజుందార్తో జరిగిన ఇంటర్వ్యూలో రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్ వారసత్వంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న ఒక చిన్న వైరల్ వీడియోలో, విరాట్ కోహ్లీని టెస్ట్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్గా అభివర్ణించిన మజుందార్ వ్యాఖ్యలను అశ్విన్ తిప్పికొట్టాడు. అశ్విన్ మాట్లాడుతూ "క్రికెట్ కంటే ఏ ఆటగాడు ఎక్కువ కాదు. ఆట అన్నిటికంటే చాలా ఉన్నతమైనది. ఆట కంటే ప్లేయర్స్ ఉన్నతంగా ఉండవలసిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. కోహ్లీ గేమ్ కంటే గొప్పోడు కాదు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు టీమిండియా అతడిని మిస్ కాదు. అతడు ఆడాడు. గుడ్ బై చెప్పాడు. అతని శకం ముగిసింది" అని అశ్విన్ రెవ్స్పోర్ట్జ్తో అన్నాడు.
టెస్ట్ ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 123 టెస్టుల్లో 210 ఇన్నింగ్స్ లు ఆడాడు. 46.85 యావరేజ్ తో 9230 పరుగులు చేశాడు. వీటిలో 30 సెంచరీలతో పాటు 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కింగ్ మరో 770 పరుగులు చేస్తే టెస్ట్ క్రికెట్ లో 10 వేల పరుగుల క్లబ్ లోకి చేరేవాడు. కానీ 10 వేల పరుగులు కాకుండానే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కోహ్లీతో పాటు రోహిత్, అశ్విన్ లు ఆస్ట్రేలియాతో 2024ల-25లో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు.