న్యూఢిల్లీ: డిజిటల్ రూపాయి పైలెట్ ప్రాజెక్టు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మొదలవుతుందని రిజర్వ్ బ్యాంక్ మంగళవారం ప్రకటించింది. ఇది డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది. దీనిని కూడా సాధారణ రూపాయి మాదిరే వాడుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని నగరాల్లోని క్లోజ్డ్ యూజర్ గ్రూపులకు, కస్టమర్లకు, మర్చంట్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. పేపర్ కరెన్సీ డినామినేషన్ల లాగే డిజిటల్ రూపాయిని కూడా జారీ చేస్తారు. ప్రస్తుతం డిజిటల్కాయిన్స్ను ఇస్తున్నామని ఆర్బీఐ ప్రకటించింది. సంబంధిత బ్యాంకులు అందించే డిజిటల్బ్యాంకుల ద్వారా డిజిటల్ రూపాయిని వాడుకోవచ్చు. ట్రాన్సాక్షన్లు పర్సన్ టూ పర్సన్ (పీ2పీ), పర్సన్ టూ మర్చంట్ (పీ2ఎం) పద్ధతుల్లో జరుగుతాయి. క్యూఆర్ కోడ్ ద్వారా కూడా చెల్లించవచ్చు. త్వరలో డిజిటల్ రూపాయిని తెస్తామని 2022 బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సాధారణ రూపాయి మాదిరే దీనికి విలువ, భద్రత, విశ్వసనీయత ఉంటాయన్నారు. బ్యాంకు వాలెట్లో డిజిటల్ రూపాయిని ఉంచినా వడ్డీ రాదు. డిజిటల్ రూపాయలను ఎఫ్డీలుగా మార్చుకోవచ్చు.
ఈ విషయమై బీసీటీ డిజిటల్ సీఈఓ జయా వైద్యనాథన్ మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా డిజిటల్ రూపాయిని ఆర్బీఐ తెచ్చిందని నిర్మలా సీతారామన్ అన్నారు. దీనివల్ల సాధారణ డబ్బుపై ఆధారపడే అవసరం తగ్గుతుందని, డిజిటల్ పేమెంట్స్ మరింత పెరుగుతాయని అన్నారు. ఈ పైలట్లో దశల వారీగా పాల్గొనడానికి ఎనిమిది బ్యాంకులను గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. మొదట నాలుగు నగరాల్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు డిజిటల్ రూపాయిని జారీ చేస్తాయి. తదనంతరం బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్తో సహా మరో నాలుగు బ్యాంకులు ఈ పైలట్ ప్రాజెక్టులో చేరనున్నాయి. మొదట ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో డిజిటల్ రూపాయి అందుబాటులోకి వస్తుంది. తరువాత అహ్మదాబాద్, గాంగ్టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా సిమ్లా నగరాల్లోని బ్యాంకులూ జారీ చేస్తాయి. తదనంతరం మరిన్ని బ్యాంకుల ద్వారా డిజిటల్ రూపాయిని తెస్తామని ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి.