
- ఫండమెంటల్గా బలంగా ఉంది
- సరిపడ ఫారెక్స్ నిల్వలున్నాయి
- గ్లోబల్ కారణాలతోనే రూపాయి వాల్యూ పతనం
- ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
బిజినెస్ డెస్క్, వెలుగు: అభివృద్ధి చెందిన చాలా దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం పేర్కొన్నారు. అంతేకాకుండా మన దగ్గర సరిపడ ఫారెక్స్ నిల్వలు ఉన్నాయని, వ్యవస్థలో డాలర్లను సరిపడ స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనామిక్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన శక్తికాంత దాస్ పై వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్గా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో పాటు ఇన్ఫ్లేషన్ పెరగడంతో చాలా దేశాల కరెన్సీలు పడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూపాయి విలువ డాలర్ మారకంలో 7 శాతం మేర తగ్గింది. కానీ, రూపాయి బలంగానే ఉందని, దేశంలో ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతోందని ఆర్బీఐ గవర్నర్ దాస్ అన్నారు. స్విస్ బ్రోకరేజ్ యూబీఎస్ సెక్యూరిటీస్ రిపోర్ట్ ప్రకారం, దేశ ఫారెక్స్ నిల్వలు ప్రస్తుతం 580 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కానీ, గరిష్ట స్థాయి 642.4 బిలియన్ డాలర్లు కంటే ఇది తగ్గిందని చెప్పాలి. గత ఐదు వారాల నుంచి దేశ ఫారెక్స్ నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. రూపాయి పతనాన్ని కంట్రోల్ చేసేందుకు 40 బిలియన్ డాలర్లను ఆర్బీఐ మార్కెట్లో అమ్మిందని, ఇతర కరెన్సీ మేనేజ్మెంట్ చర్యలను తీసుకుంటోందని ఎనలిస్టులు చెబుతున్నారు. దేశ విదేశీ అప్పుల్లో 95 శాతం వాటాను ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు కవర్ చేస్తాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇది 2012–13 లో 70 శాతంగా ఉండేదని పేర్కొన్నారు. 10.5 నెలల దిగుమతులను ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు కవర్ చేయగలవని, ఇది 2012–13 లోని 7 నెలలు కంటే ఎక్కువని అన్నారు. కానీ, 2007–08 లో నమోదైన స్థాయి 14.4 నెలల దిగుమతులతో పోలిస్తే మాత్రం ఇది తక్కువ. డాలర్ మారకంలో రూపాయి విలువ వచ్చే మార్చి నాటికి 80 దగ్గర సెటిలవుతుందని ఎనలిస్టులు అంచనావేశారు.
ఫండమెంటల్సే రూపాయిని నిర్ణయిస్తాయి..
రూపాయిని నిర్ధిష్టమైన లెవెల్లో కంట్రోల్ చేయాలనే ఆలోచనలో ఆర్బీఐ లేనట్టు తెలుస్తోంది. ‘రూపాయి కదలికలు నిలకడగా ఉన్నాయి. ఫారెక్స్ మార్కెట్ను గమనిస్తున్నాం. రూపాయి కదలికల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటే చూస్తు ఊరుకోము. ఫండమెంటల్స్ బట్టి రూపాయి సరియైన లెవెల్లో సెటిలవుతుంది’ అని శక్తికాంత దాస్ అన్నారు. ఫండమెంటల్స్ బాగుండడంతో దేశ ఎకానమీ మిగిలిన దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే మంచి స్థాయిలో ఉందని పేర్కొన్నారు.
లైసెన్స్కు లోబడే పనిచేయాలి..
ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు, ఆన్లైన్లో అప్పులు ఇచ్చే కంపెనీలు కచ్చితంగా ఆర్బీఐ నుంచి లైసెన్స్ పొందాలని, ఈ లైసెన్స్ రూల్స్కి లోబడే పనిచేయాలని శక్తికాంత దాస్ అన్నారు. ఎటువంటి లైసెన్స్ పొందకుండా కార్యకలాపాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి కంపెనీల వలన ఎకానమీలో ఫైనాన్షియల్ రిస్క్ పెరుగుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు. రానున్న కొన్ని వారాల్లో డిజిటల్ లెండింగ్కి సంబంధించి రూల్స్ను తీసుకొస్తామని చెప్పారు.