- ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఏయూ ఎస్ఎఫ్బీ), ఫెడరల్ బ్యాంకులలో గరిష్టంగా 9.99శాతం వరకు వాటాలను కొనుగోలు చేసేందుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోటక్ మహీంద్రా గ్రూప్, దాని అనుబంధ సంస్థలకు వీటిలో స్వల్ప వాటాలున్నాయి. తాజా అనుమతులతో కోటక్ బ్యాంక్ తన వాటాను దశల వారీగా లేదా ఒక్కసారిగా పెంచుకోవడానికి వీలుంటుంది. కానీ, షేర్ క్యాపిటల్ లేదా ఓటింగ్ హక్కులలో 9.99శాతం మించకూడదు.
బ్యాంకుల్లో 5 శాతానికి మించి వాటాలు కొనాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. 10 శాతం దాటితే నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయి. అందుకే 9.99 శాతాన్ని గరిష్ట పరిమితిగా పెట్టారు. ఈ వార్త వెలువడిన తర్వాత ఈ మూడు బ్యాంకుల షేర్లు లాభాల్లో కదిలాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 0.99శాతం, ఫెడరల్ బ్యాంక్ 1.47శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.12శాతం మేర పెరిగాయి. ఈ పెట్టుబడుల ద్వారా బ్యాంకింగ్ రంగంలో కోటక్ బ్యాంక్ మరింతగా విస్తరించడానికి వీలుంటుంది.
