ఆగమవుతున్న అదానీ గ్రూప్​...అప్పులపై ఆర్​బీఐ ఆరా

ఆగమవుతున్న అదానీ గ్రూప్​...అప్పులపై ఆర్​బీఐ ఆరా

వెలుగు, బిజినెస్​ డెస్క్​: హిండెన్​బర్గ్​ రిపోర్టు వచ్చాక అదానీ గ్రూప్​ షేర్లు పతనమవడంపై సెబీ ఇప్పటికే ఆరా తీస్తుండగా, తాజాగా దేశంలోని బ్యాంకులు ఆ గ్రూప్​ కంపెనీలకు ఇచ్చిన అప్పులపైనా రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) ఆరా తీస్తోంది. అదానీ గ్రూప్​కు ఏ బ్యాంకు ఎంతెంత అప్పులు ఇచ్చిందో వివరాలు చెప్పమని ఆర్​బీఐ కోరినట్లు ప్రభుత్వ సీనియర్​ ఆఫీసర్​ ఒకరు గురువారం వెల్లడించారు. మరోవైపు పార్లమెంట్​లోనూ అదానీ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. 

ఎస్​బీఐ ఇచ్చింది 2.6 బిలియన్​ డాలర్లు...

దేశంలోని అతి పెద్ద బ్యాంక్​ స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా అదానీ గ్రూప్​ కంపెనీలకు 2.6 బిలియన్​ డాలర్ల మేర అప్పులు ఇచ్చినట్లు సమాచారం. అయితే, అప్పులు–వడ్డీలను అదానీ గ్రూప్​ సక్రమంగా చెల్లిస్తున్నందున, ఇప్పటికిప్పుడు ఇబ్బందులేవీ లేవని ఎస్​బీఐ చైర్మన్​ దినేష్​ కుమార్​ ఖారా చెప్పారు. ఎంత అప్పు ఇచ్చినదీ చెప్పేందుకు ఎస్​బీఐ అఫీషియల్​ స్పోక్స్​పర్సన్​ అందుబాటులోకి రాలేదు.  మరోవైపు పంజాబ్​ నేషనల్​ బ్యాంకు ఇచ్చిన అప్పులు రూ. 7 వేల కోట్ల దాకా ఉన్నట్లు కిందటి నెలలో ఆ బ్యాంకు సీఈఓ అతుల్​ గోయెల్​ మీడియాకు చెప్పారు. అదానీ గ్రూప్​కు తాము ఇచ్చిన అప్పులు తమ మొత్తం అప్పుల్లో 0.1 శాతం కంటే తక్కువేనని ఐడీఎఫ్​సీ ఫస్ట్​బ్యాంక్​ గురువారం ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది.

ఆగని షేర్ల పతనం..

షార్ట్​సెల్లర్​ హిండెన్​బర్గ్​ రిపోర్టు తెచ్చిన రోజు నుంచీ పడుతున్న అదానీ గ్రూప్​ కంపెనీల షేర్లు గురువారం ట్రేడింగ్​లోనూ మరింత పతనమయ్యాయి. అదానీ గ్రూప్​ షేర్ల భారీ పతనంతో ఆయా కంపెనీలలోని ఇన్వెస్టర్లు మొత్తం 100 బిలియన్​ డాలర్ల దాకా నష్టపోయారు. వరసగా చివరి ఆరు ట్రేడింగ్​ సెషన్లలోనూ అదానీ గ్రూప్​ కంపెనీల మార్కెట్​విలువ పడుతూనే ఉంది. మొత్తం 10 లిస్టెడ్​ కంపెనీల మార్కెట్​ విలువ తాజాగా  రూ. 10.89 లక్షల కోట్లకు తగ్గిపోయింది. హిండెన్​బర్గ్​ రిపోర్టుకు ముందు ఈ కంపెనీల మార్కెట్​ విలువ రూ. 19.2 లక్షల కోట్లు. దీంతో బ్లూమ్​బర్గ్​రియల్​టైమ్​బిలియనీర్ల లిస్టులోనూ, ఫోర్బ్స్​ లిస్టులోనూ కూడా గౌతమ్​ అదానీ ఇప్పుడు వెనకపడిపోయారు. ముకేశ్​ అంబానీ మళ్లీ  ముందుకు దూసుకెళ్లారు. 

గ్లోబల్​ రిచ్​లిస్టులో కిందటేడాది  రెండో ప్లేస్​కి ఎదిగిన అదానీ సంపద గత ఆరు రోజుల్లో ఆవిరయిపోయింది. ఫాలో ఆన్​ పబ్లిక్​ ఆఫర్​తో కొనసాగడం నైతికంగా సరయినది కాదని భావిస్తున్నామని, ఇన్వెస్టర్లందరికీ ఎఫ్​పీఓ డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నామని బుధవారం రాత్రి గౌతమ్​ అదానీ ప్రకటించినా, అది స్టాక్​ మార్కెట్​ ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించలేకపోయింది.

వారంలో అదానీకి అన్నీ ఎదురుదెబ్బలే....

  • జనవరి 24.....      అదానీ గ్రూప్​ షేర్ల మానిప్యులేషన్​, ఎకౌంటింగ్ ఫ్రాడ్స్​కు పాల్పడుతోందంటూ  షార్ట్​సెల్లర్​ హిండెన్​బర్గ్​ 106 పేజీల రిపోర్టు విడుదల.  అదానీ గ్రూప్​ వివరణ కోరిన ఎంఎస్​సీఐ 
  • జనవరి 29 ....హిండెన్​బర్గ్​ ఆరోపణలు నిజం కాదంటూ 413 పేజీల స్టేట్​మెంట్​ విడుదల చేసిన అదానీ గ్రూప్​... తామడిగిన అసలు ప్రశ్నలకు జవాబులే వంటూ హిండెన్​బర్గ్​ విమర్శ
  • కరిగిపోయిన అదానీ వ్యక్తిగత సంపద....షేర్ల మార్కెట్​ విలువ దారుణంగా పతనం కావడంతో గ్లోబల్​ టాప్​ 10 బిలియనీర్ల లిస్ట్​ నుంచి గౌతమ్​ అదానీ అవుట్​..
  • అదానీ గ్రూప్​ కంపెనీల షేర్లు, బాండ్స్​ను కోలేటరల్​గా ఒప్పుకోవడం నిలిపివేసిన క్రెడిట్​ సూయెజ్​, సిటీ గ్రూప్​
  • అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ ఎఫ్​పీఓ కాన్సిల్​ ప్రకటన
  • యూఎస్​ ట్రేడింగ్​లో డిస్ట్రెస్​ లెవెలకు పడిపోయిన అదానీ గ్రూప్​ బాండ్లు
  • అదానీ గ్రూప్​లో ఏం జరుగుతోందంటూ ఆరా తీస్తున్న సెబీ, ఆర్​బీఐ

అదానీపై ఎన్​ఎస్​ఈ నజర్​..

అదానీ గ్రూప్​ కంపెనీలు....అదానీ ఎంటర్​ప్రైజస్​, అదానీ పోర్ట్స్​, అంబుజా సిమెంట్​లను ఎడిషనల్​ సర్విలెన్స్​ మార్జిన్​ (ఏఎస్​ఎం) ఫ్రేమ్​వర్క్​ కిందకి తెస్తున్నట్లు నేషనల్​స్టాక్​ ఎక్స్చేంజ్​ (ఎన్​ఎస్​ఈ) గురువారం ప్రకటించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 3 అంటే శుక్రవారం నుంచే అమలులోకి వస్తుందని తెలిపింది. ఏఎస్​ఎం కిందకి తేవడం వల్ల ఇంట్రా డే ట్రేడింగ్​ చేయాలన్నా 100 శాతం మార్జిన్​ను ముందే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో స్పెక్యులేషన్​కు, షార్ట్​సెల్లింగ్​కు అడ్డుకట్ట పడుతుంది.

ఇతర గ్రూప్​ కంపెనీలు ఎన్​డీటీవీ, అదానీ పవర్​, అదానీ విల్​మార్​ షేర్లు కూడా 5 శాతం పతనమై లోయర్​ సర్క్యూట్లను తాకాయి. ఇంకోవైపు క్రెడిట్​ సూయెజ్​, 
సిటీ గ్రూప్​లు మార్జిన్​ లోన్లకు అదానీ గ్రూప్ షేర్లు,​ బాండ్స్​ను కోలేటరల్​గా అంగీకరించడం ఆపేశాయి.