ఆర్థిక మాంధ్యం ప్రభావంతో మళ్లీ వడ్డీ రేట్లు పెంచుతారనే వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏప్రిల్ 6వ తేదీ గురువారం ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. వడ్డీ రేట్లు పెంచటం లేదని.. యథాయథంగా కొనసాగిస్తామని వివరించారు. రెపో రేటు యథాతధంగా ఉంచాలనే నిర్ణయాన్ని మానిటరీ పాలసీ కమిటీ లోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు సమర్థించినట్లు వెల్లడించారాయన.
పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ గత ఆర్థిక సంవత్సరం నుంచి రెపో రేట్లు పెంచుతూ వస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో.. ఆర్బీఐ రెపోరేటును ఆరు సార్లు పెంచింది. ఈ సారి కూడా ధరలు అధికంగా ఉండటం.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు ఉండటంతో.. మళ్లీ వడ్డీ రేట్లు పెంచుతారని అందరూ భావించారు. అయితే అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదంటూ దేశ ప్రజలకు ఊరటనిచ్చారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయంతో హోం లోన్, పర్సనల్ లోన్ తోపాటు బ్యాంక్ అప్పులు తీసుకున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈసారికి వడ్డీ రేట్లలో మార్పు లేకపోవటం గుడ్ న్యూస్ గా చెబుతున్నాయి వ్యాపార వర్గాలు.