- 61 రన్స్ తేడాతో గుజరాత్పై గెలుపు.. రాణించిన గౌతమి, సయాలీ
వడోదర: డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమ్మాయిలు రప్ఫాడిస్తున్నారు. ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచి అందరికంటే ముందే ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్నారు. యంగ్ సెన్సేషన్ గౌతమి నాయక్ (55 బాల్స్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 73) మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగడంతో సోమవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 61 రన్స్ తేడాతో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 178/6 స్కోరు చేసింది. రిచా ఘోశ్ (27), కెప్టెన్ స్మృతి మంధాన (26) కూడా రాణించారు. గుజరాత్ బౌలర్లలో కాశ్మీ గౌతమ్, గార్డ్నర్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్లో గుజరాత్ 20 ఓవర్లలో 117/8 స్కోరు మాత్రమే చేసి ఓడింది. కెప్టెన్ యాష్లే గార్డ్నర్ (43 బాల్స్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 54) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. సయాలీ సత్ఘారే (3/21) మూడు వికెట్లతో దెబ్బకొట్టింది. గౌతమి నాయక్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
గౌతమి ధమాకా
టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన ఆర్సీబీకి ఆరంభంలోనే వరుసగా ఎదురుదెబ్బలు తిగిలినా గౌతమి పోరాటంతో మంచి స్కోరు చేసింది. స్టార్ ఓపెనర్ గ్రేస్ హారిస్ (1)ను ఆరో బాల్కు రేణుక సింగ్ ఔట్ చేయగా.. రెండో ఓవర్లో కశ్వీ బౌలింగ్లో జార్జియా వోల్ (0) బౌల్డ్ అయింది. 9/2తో కష్టాల్లో ఆర్సీబీ ఇన్నింగ్స్ను కెప్టెన్ స్మృతి మంధాన తో కలిసి గౌతమి ఇన్నింగ్స్ను ఆదుకుంది. గార్డ్నర్ బౌలింగ్లో రెండు ఫోర్లతో మంధాన వేగం పెంచే ప్రయత్నం చేయగా.. తొలుత గౌతమి నిదానంగా ఆడటంతో పవర్ ప్లేలో ఆర్సీబీ 37/2తో నిలిచింది. అయితే ఫీల్డింగ్ మారిన వెంటనే రేణుక బౌలింగ్లో సిక్స్తో గౌతమి గేరు మార్చింది. తను మంచి షాట్లతో క్రమం తప్పకుండా బౌండ్రీలు రాబట్టగా.. క్రీజులో కుదురుకున్న మంధానను పదో ఓవర్లో గార్డ్నర్ ఎల్బీ చేసింది. దాంతో మూడో వికెట్కు 60 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. మంధాన ఔటైన తర్వాత గౌతమి మరింత ధాటిగా ఆడింది. తనకు కాసేపు రిచా ఘోశ్ సపోర్ట్ ఇచ్చింది. వారెహమ్ వేసిన 12వ ఓవర్లో గౌతమి ఫోర్, రిచా సిక్స్తో అలరించారు. ఫిఫ్టీ దాటిన వెంటనే కశ్వీ క్యాచ్ బ్రాప్ చేయడంతో లైఫ్ దక్కించుకున్న గౌతమిఅదే జోరు కొనసాగించింది. ఇక తనూజ వేసిన 16వ ఓవర్లో రెండు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించిన రిచాను తర్వాతి ఓవర్లో సోఫీ డివైన్ ఔట్ చేసింది. రెండు బాల్స్ తర్వాత గార్డ్నర్ బౌలింగ్లో గౌతమి బౌల్డ్ అయినా.. చివరి ఓవర్లో రాధా యాదవ్ (17), శ్రేయాంక పాటిల్ (8 నాటౌట్) చెరో రెండు ఫోర్లతో ఆర్సీబీ స్కోరు 170 మార్కు దాటించారు.
గుజరాత్ ఢమాల్
టార్గెట్ ఛేజింగ్లో గుజరాత్ స్టార్టింగ్ నుంచే తడబడింది. కెప్టెన్ గార్డ్నర్ తప్ప మిగతా వాళ్లు బ్యాట్లెత్తేయడంతో ఏ దశలోనూ ఆర్సీబీకి పోటీ ఇవ్వలేకపోయింది. స్కోరుబోర్డుపై ఐదు రన్స్ చేరేలోపే ముగ్గురు బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. రెండో ఓవర్లో ఓపెనర్ బెత్ మూనీ (3), సోఫీ డివైన్ (0)ను ఔట్ చేసిన సయాలీ సత్ఘారే జెయింట్స్కు షాకిచ్చింది. తర్వాతి ఓవర్లోనే కనికా అహూజా (0)ను లారెన్ బెల్ బౌల్డ్ చేయడంతో గుజరాత్ 5/3తో ఎదురీత మొదలు పెట్టింది. గార్డ్నర్ ఆర్సీబీ బౌలర్లకు ఎదురునిలిచినా.. మరో ఎండ్లో ఆమెకు సపోర్ట్ కరువైంది. కాసేపు పోరాడిన అనుష్క శర్మ (18)ను డిక్లెర్క్ వెనక్కుపంపగా.. కశ్వీ గౌతమ్ (4), వారెహమ్ (2) నిరాశపరిచారు. ఒంటరి పోరాటం చేస్తూ ఫిఫ్టీ అందుకున్న గార్డ్నర్ను సత్ఘారే పెవిలియన్ చేర్చడంతో గుజరాత్ ఓటమి ఖాయమైంది.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 178/6 (గౌతమి నాయక్ 73, రిచా ఘోశ్ 27, కశ్వీ గౌతమ్ 2/38).
గుజరాత్: 20 ఓవర్లలో 117/8 (గార్డ్నర్ 54, సయాలీ సత్ఘారే 3/21, డిక్లెర్క్ 2/17).
