
- అందులో భాగమైన అన్ని సంస్థలను విచారించాలి: నైనాల గోవర్ధన్
హైదరాబాద్, వెలుగు: జ్యుడీషియల్ కమిషన్లను బెదిరించేలా వ్యవహరిస్తున్న కేసీఆర్ రాచరిక పోకడలను ఖండించాలని తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జుడీషియల్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం మార్చాలన్నారు. రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ పేరిట తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టును కాళేశ్వరానికి మార్చడమే అవినీతికి మొదటి అడుగు అని గురువారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
‘‘రూ.28 వేల కోట్లతో 3వ టీఎంసీ అని సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండానే నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్ట్ను మేఘా కంపెనీకి ఇవ్వడంపై కూడా ఎంక్వైరీ చేయాలి. మల్లన్న సాగర్ నిర్మాణంపై విచారణ జరగాలి. ఒక్క టీఎంసీ అని చెప్పి సగం టీఎంసీని కూడా ఎదురెక్కించలేక పోయిన రూ.2 వేల కోట్లతో చేపట్టిన శ్రీరాంసాగర్ పునరుజ్జీవ ప్రాజెక్టుపైనా విచారణ జరిపించాలి.
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను మేఘా కంపెనీ పంపింగ్ వ్యవస్థలు, తప్పుల తడక డిజైన్లను ఆమోదించిన సీడబ్ల్యూసీపైనా ఎంక్వైరీ చేయాలి. కేంద్రంలోని వ్యాప్కోస్నూ విచారణలో భాగం చేయాలి. మేఘా కంపెనీ ఇచ్చిన రూ.1186 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్పై విచారణ జరిపించాలి’’ అని డిమాండ్ చేశారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు దీనిపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.