యుద్ధానికే కాదు.. దేశ సేవకు మేము సైతం : ఒక్క పిలుపుతో వేలాది మంది తరలివచ్చారు.. !

యుద్ధానికే కాదు.. దేశ సేవకు మేము సైతం : ఒక్క పిలుపుతో వేలాది మంది తరలివచ్చారు.. !

ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం క్రమంలో అన్ని రాష్ట్రాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో హై టెన్షన్ నెలకొంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. పాకిస్తాన్ సైతం.. పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన సైనిక స్థావనాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. పౌర సేవలు, భారతీయ పౌరుల రక్షణ కోసం ఇప్పటికే దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాయి ప్రభుత్వాలు. దీనికితోడు రాబోయే రోజుల్లో పరిస్థితులు అదుపు తప్పకుండా.. జనం రక్షణ కోసం స్వచ్ఛంధ సేవ కోసం చండీఘడ్ స్థానిక కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 

ఇందులో భాగంగా పరిపాలన, పౌర సేవల కోసం.. జనం రద్దీ ఉండే ప్రాంతాల్లో సేవల కోసం చండీఘడ్ కార్పొరేషన్ ఓ ప్రకటన ఇచ్చింది. అంతే యువ రక్తం ఉరకలెత్తింది. యుద్ధానికి మేము సైతం.. దేశ సేవ కోసం మేం సైతం అంటూ వేలాది మంది యువకులు తరలివచ్చారు. తమ తమ పేర్లు నమోదు చేసుకోవటానికి కార్పొరేషన్ ఎదుట పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి. దేశ భక్తిని.. దేశ భద్రతలో తమ వంతు సాయానికి ముందుకు వచ్చింది యువత.

 చండీగఢ్ యుటి డిప్యూటీ కమిషనర్ ప్రకటనతో  మే 10  చండీగఢ్‌లోని ఠాగూర్ థియేటర్‌లో పెద్ద సంఖ్యలో యువత  తరలివచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.    భారత సైన్యానికి మద్దతు ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చామని  ఈ సందర్భంగా యువత చెబుతోంది.  సైన్యం  మన కోసం చాలా చేస్తోంది. మన సైన్యం కోసం మేం కూడా ఏదైనా చేయాలనుకుంటున్నాము  అని అన్నారు.  మరో స్థానికురాలు సంజన అరోరా మాట్లాడుతూ ..  భారత సైన్యానికి సహాయం చేయాలని వచ్చాం.. పాకిస్తాన్  నిరంతర రెచ్చగొట్టే చర్యలకు ధైర్యంగా ప్రతిస్పందిస్తున్న మన సైనికులతో మనమందరం నిలబడాలి అని  అన్నారు.

మరో వైపు పాకిస్తాన్ దాడులను తీవ్రం చేసింది. పాకిస్తాన్ రెచ్చగొడుతూ అటాక్ చేస్తుంది.   క్షిపణి, డ్రోన్ లతో సరిహద్దు ప్రాంతాల్లోని పౌరుల నివాసాలే టార్గెట్ గా దాడులు చేస్తోంది. అంతే ధీటుగా పాకిస్తాన్ కు బదులిస్తొంది మన  ఇండియన ఆర్మీ.   పంజాబ్  లోని ఎయిర్ బేస్ ధ్వంసానికి పాక్ యత్నించిందని  ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. మే 9న రాత్రి 26 ప్రాంతాల్లో డ్రోన్  దాడులు చేసిందని తెలిపింది. అవంతిపూర్,కుప్వారా,బారాముల్లా ప్రాంతాల్లో పాక్ కాల్పులకు బదులిచ్చామని.. భారత్ పూర్తిగా సంయమనంతో వ్యవహరిస్తోందని వెల్లడించింది.  పశ్చిమ భారత సరిహద్దులో పాక్ దాడులు చేస్తోందని వెల్లడించింది