
ఆరడుగుల రూపం.. గంభీరమైన స్వరం.. నడకలో రాజసం.. నడతలో హుందాతనం.. విలన్ పాత్రల నుంచి హీరోగా మారి స్టార్ అయిన తొలి తెలుగు నటుడాయన. సాఫ్ట్ రోల్స్ అయినా.. ఫెరోషియస్ పాత్రలు పోషించినా తిరుగులేనిది ఆయన నటన. ఐదు దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో రారాజుగా వెలిగిన ఆయనే రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఆయన అస్తమయంతో టాలీవుడ్లో ఒక శకం ముగిసింది. ఆయనకి ఇది వెలుగు నివాళి.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న పుట్టారు కృష్ణంరాజు. ఆయన పూర్తిపేరు ఉప్పలపాటి చిన వెంకట కృష్ణంరాజు. ఎనిమిదో క్లాస్ వరకు మొగల్తూరు బోర్డ్ హై స్కూల్, నర్సాపూర్లో చదివారు. క్షత్రియుల కుటుంబం కావడంతో స్కూల్లో ఆయన్ని రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రిన్స్లా ట్రీట్ చేసేవారు. ఆ తర్వాత హైదరాబాద్ బద్రుకా కాలేజ్లో బీకామ్ జాయిన్ అయ్యారు. అదే సమయంలో తమ బంధువులు నడిపే ‘ఆంధ్రరత్న’ అనే దిన పత్రికలో జర్నలిస్ట్గా పని చేశారు. మరోవైపు ఫొటోగ్రఫీపై మక్కువతో అబిడ్స్లో ‘రాయల్ స్టూడియో’ పేరుతో ఫొటో స్టూడియో కూడా నడిపారు. స్టిల్ ఫొటోగ్రఫీతో పాటు డాక్యుమెంటరీస్, యాడ్ ఫిల్మ్స్ తీశారు. హైస్కూల్ రోజుల నుండే సినిమాలపై ఉన్న ఆసక్తి.. కాలేజీ రోజులకు మరింత పెరిగింది. అదే ఆయన్ను సినిమాల వైపు అడుగులు వేసేలా చేసింది.
స్టార్... రెబల్ స్టార్
ఐదున్నర దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలోగొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణంరాజు అన్ని రకాల పాత్రల్లోనూ మెప్పించారు. భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, రారాజు, త్రిశూలం, రంగూన్ రౌడీ, మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య, పల్నాటి పౌరుషం లాంటి సినిమాలు ఆయనకు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. సాంఘిక, పౌరాణిక చిత్రాలతో పాటు జానపద చిత్రాల్లోనూ నటించారు. ‘కటకటాల రుద్రయ్య’ సినిమా ఆయనకు రెబల్ స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. నైంటీస్ తర్వాత హీరో నుంచి క్యారెక్టర్స్ వైపు టర్న్ అయ్యారు కృష్ణంరాజు. అందులోనూ తన ఇమేజ్కు తగ్గ హుందాతనం ఉన్న పాత్రకే ఓకే చెప్పారు. అలా బావబావమరిది, జైలర్ గారి అబ్బాయి, గ్యాంగ్ మాస్టర్, పల్నాటి పౌరుషం, నాయుడు గారి కుటుంబం, మా నాన్నకు పెళ్లి, సుల్తాన్, బిల్లా, రెబల్, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాల్లో నటించారు. దాదాపు 40 సినిమాల్లో ఇతర హీరోలతో కలిసి ఆయన స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. హీరోగా కెరీర్ ప్రారంభించి, విలన్గా మారి, ఆపై తిరిగి తనను తాను ఓ స్టార్గా మలచుకున్న సెల్ఫ్ మేడ్ హీరో కృష్ణంరాజు.
విలన్ టు హీరో
సినిమాలపై ఆసక్తితో డిగ్రీ పూర్తిచేయకుండానే మద్రాసు వెళ్లారు కృష్ణంరాజు. కొన్ని ప్రయత్నాల తర్వాత ‘తేనెమనసులు’ చిత్రానికి మేకప్ టెస్ట్లో పాల్గొన్నారు. కృష్ణ హీరోగా సెలెక్టయితే కృష్ణంరాజు రిజెక్ట్ అయ్యారు. ఆ తర్వాత కూడా కొన్ని రిజెక్షన్లు ఎదురైనప్పటికీ, ఆయన కోరుకున్నట్టుగానే ప్రత్యగాత్మ డైరెక్షన్లోనే హీరోగా పరిచయం అయ్యారు. ‘చిలకా గోరింక’ ఆయన తొలిచిత్రం. కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో విలన్గా నటించారు. అప్పటివరకూ మూస పద్ధతిలో వెళ్తున్న విలనిజానికి చెక్ పెట్టి పాలిష్డ్ విలన్గా మెప్పించారు కృష్ణంరాజు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సీనియర్స్ మొదలు కృష్ణ, శోభన్ బాబు లాంటి తన వయసు హీరోల చిత్రాల్లోనూ బెస్ట్ విలన్ అనిపించుకున్నారు. విలనిజమ్లోనూ హీరోయిజం చూపించి నటుడిగా ట్రెండ్ సెట్టర్ అయ్యారు. విలన్గా దాదాపు ముప్ఫై సినిమాల తర్వాత ‘ఇంటిదొంగలు’ చిత్రంతో సపోర్టింగ్ హీరోగా టర్న్ అయ్యారు కృష్ణంరాజు. అలా అరవై సినిమాలు చేసి, తన అరవై ఒకటవ సినిమాతో నిర్మాతగా సొంత బ్యానర్ స్టార్ట్ చేశారు.
యాభై ఏండ్ల అనుబంధం: కృష్ణ, కృష్ణంరాజు మధ్య యాభై ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ‘తేనెమనసులు’ సినిమా ఆడిషన్స్ టైమ్లో మొదలైన వీరి స్నేహ బంధం ఎన్నో హిట్ చిత్రాలకు దారి తీసింది. నేనంటే నేనే, ఇంద్ర భవనం, యుద్ధం, అడవి సింహాలు లాంటి పదిహేడు సక్సెస్ఫుల్ సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. ‘మరణశాసనం’ చిత్రంలోని పోలీస్ ఆఫీసర్ పాత్రకు తన కంటే కృష్ణంరాజు న్యాయం చేయగలడని నమ్మి ఆయనతోనే సినిమా నిర్మించారు కృష్ణ. కృష్ణంరాజు మరణ వార్తతో కన్నీటి పర్యంతమైన కృష్ణ, తమ స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు.
సినీ ప్రముఖుల సంతాపం: కృష్ణంరాజు మరణం వెండితెరకు తీరనిలోటు అంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సహా పలువురు హీరోలు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
గోపీకృష్ణా మూవీస్ విజయ సారథి
విలన్గా, సపోర్టింగ్ హీరోగా బిజీగా ఉన్న టైమ్లోనే ‘గోపీకృష్ణా మూవీస్’ బ్యానర్ని స్టార్ట్ చేశారు. ఆ వ్యవహారాలన్నీ ఆయన తమ్ముడు సూర్యనారాయణరాజు చూసుకునేవారు. ఈ సంస్థలో తీసిన కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం సంచలన విజయాలు సాధించి, నిర్మాతగానే కాక హీరోగానూ కృష్ణంరాజు స్థాయిని పెంచాయి. అలాగే కటకటాల రుద్రయ్య, మనవూరి పాండవులు చిత్రాలు వారం గ్యాప్లో విడుదలై సిల్వర్ జూబ్లి హిట్స్గా నిలిచాయి. ఆ తర్వాత తీసిన ‘మధుర స్వప్నం’ నిరాశపరిచినా, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ భారీ విజయాన్ని అందుకుంది. ఆ ఉత్సాహంతో ‘తాండ్ర పాపారాయుడు’ తీశారు. కానీ అనుకున్నట్టుగా మెప్పించలేకపోయింది. అదే సమయంలో ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రాన్ని ‘ధర్మాధికారి’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఆ తర్వాత మా ఇంటి మారాజు, ప్రాణ స్నేహితులు చిత్రాలు నిర్మించారు. కృష్ణంరాజు డ్యూయెల్ రోల్ చేసిన ‘యమధర్మరాజు’ చిత్రం ఆర్థికంగా ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టింది. దాంతో నిర్మాతగా కొంత గ్యాప్ తీసుకుని ‘బిల్లా’తో రీఎంట్రీ ఇచ్చారు. ‘రాధేశ్యామ్’ చిత్రంతో ఆయన కూతురు ప్రసీద నిర్మాతగా పరిచయమయ్యారు.
ఉత్తమ నటుడిగా..
కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన కృష్ణంరాజు మొత్తం187 పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో కొన్ని సినిమాలు ఆయనకు అవార్డులు తెచ్చిపెట్టాయి. 1977లో ‘అమరదీపం’ చిత్రంలో నటనకుగానూ రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. 1978లో ‘మనవూరి పాండవులు’ సినిమాకు గానూ మరోసారి రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. అలాగే అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలకు ఉత్తమ నటుడిగా రెండు నంది అవార్డులు అందుకున్నారు. 2006లో ఫిల్మ్ ఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు 2014లో రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకున్నారు.
ప్రభాస్ సక్సెస్ వెనుక..
కృష్ణంరాజు తమ్ముడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడే ప్రభాస్. తన నటవారసుడిగా ప్రభాస్ను పరిచయం చేయడం మొదలు అతను ప్యాన్ ఇండియా స్టార్ అవడం వరకూ తెరవెనుక కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. ప్రభాస్తో కలిసి బిల్లా, రెబల్, రాధేశ్యామ్ సినిమాల్లో ఆయన నటించారు. తన చివరి చిత్రం (రాధేశ్యామ్) కూడా ప్రభాస్తోనే కలిసి నటించారు. ఇక ఆయనకు భార్య శ్యామలా దేవి, కుమార్తెలు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు.
అవి నెరవేరకుండానే..
అన్ని విధాలుగానూ సక్సెస్ అయిన కృష్ణం రాజుకి కొన్ని తీరని కోరికలు మిగిలిపో యాయి. వాటిలో మొదటిది.. ప్రభాస్కి పెళ్లి చేయడం. ఆయన ప్రతి ఇంటర్వ్యూ లోనూ ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించే వారు. అలాగే ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని ప్రభాస్తో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో కుదరలేదు. ప్రభాస్ కోసం ‘ఒక్క అడుగు’ టైటిల్తో మరో స్ర్కిప్ట్ను కూడా సిద్ధం చేశారు. ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. కృష్ణంరాజుకు ‘విశాల నేత్రాలు’ నవలంటే చాలా ఇష్టం. దాన్ని సినిమాగా తీయాలనుకున్నా వర్కవుట్ అవ్వలేదు. స్టూడియో నిర్మించాలనే ఆయన కోరిక కూడా నెరవేరలేదు. ఇక కేంద్రమంత్రిగా చేసిన కృష్ణంరాజుకు గవర్నర్గా సేవలందించాలని ఉండేది. పలు సందర్భాల్లో ఆయనకు గవర్నర్ పదవి వచ్చేసిందంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ అది నిజం కాలేదు.