రెవె‘న్యూ’ సెంటర్లు
తహసీల్దార్ఆఫీసుల్లో రిసెప్షన్ కౌంటర్లు
ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక చర్యలు
భైంసా, వెలుగు: తహసీల్దార్ఆఫీసులకు వచ్చే ఫిర్యాదుదారులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అన్ని తహసీల్దార్ఆఫీసుల్లో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తహసీల్దార్ఆఫీసుల్లో ఈ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 51 మండలాలు ఉన్నాయి. నాలుగు జిల్లా కేంద్రాలు ఉండగా.. 11 వరకు పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాల్లో ఉన్న తహసీల్దార్ఆఫీసుల్లో సర్కారు రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. కొన్ని ఆర్డీవో ఆఫీసుల్లో కూడా వీటిని ఏర్పాటు చేసింది. ఆఫీసుల్లో ఎంట్రన్స్దగ్గరే ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. టేబుల్, క్యాబిన్, కుర్చీలతోపాటు ఇతర సామగ్రిని సమకూర్చింది. ప్రతి రిసెప్షన్ కేంద్రంలో ఆయా కార్యాలయాల్లోని ఒక ఆఫీసర్, సిబ్బంది పని వేళల్లో అందుబాటులో ఉంటూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
చక్కర్లు కొట్టే అవసరం లేదు
ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం ఇన్నాళ్లు ఆఫీస్ల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. తహసీల్దార్ఆఫీసులో ఫిర్యాదు పత్రాలు ఇచ్చేందుకు గానీ, రిసీవ్డ్ కాపీ తీసుకునేందుకు ఇబ్బందులు ఏర్పడేవి. కొన్ని సమయాల్లోనైతే సంబంధిత ఆఫీసర్అందుబాటులో లేకపోతే రెండు, మూడుసార్లు తిరగాల్సి వచ్చేంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కౌంటర్తో ఆ బాధలు తప్పాయి. ఫిర్యాదుదారులు ఆఫీస్కు రాగానే.. అక్కడున్న ఆఫీసర్, సిబ్బంది ఫిర్యాదు తీసుకుంటారు. ఆ ఫిర్యాదు ఆఫీస్లో ఏ విభాగానికి సంబంధించిందో ఆ అధికారి వద్దకు స్వయంగా తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. అటు ఫిర్యాదుదారుడికి జవాబుదారీగా ఈ వ్యవస్థ పని చేయనుంది.