లీకేజీ తంటాలు తీరేనా .. గ్రేటర్ వరంగల్ రోడ్లపై రెగ్యులర్గా పైప్ లైన్ లీకులు

లీకేజీ తంటాలు తీరేనా .. గ్రేటర్ వరంగల్ రోడ్లపై రెగ్యులర్గా పైప్ లైన్ లీకులు
  • రిపేర్లు చేస్తున్నా అదేచోటా మళ్లీ డ్యామేజ్
  • నామమాత్రపు పనులు చేస్తున్నారనే ఆరోపణలు
  • వృథా అవుతున్న జీడబ్ల్యూఎంసీ నిధులు
  • రోడ్లపై గుంతలతో జనాలు, వాహనదారులకు ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు: గ్రేటర్​ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో తాగునీటి పైపులైన్లు లీకేజీలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల ఎన్నిసార్లు రిపేర్ చేసినా మళ్లీ లీకవుతుండగా, మరోసారి లీకవకుండా క్వాలిటీగా పనులు చేయాల్సి ఉన్నా, అధికారులు నామమాత్రపు పనులతో సరి పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా రిపేర్ చేసిన కొద్దిరోజులకే ఆ పైపులైన్లు మళ్లీ డ్యామేజ్ అవుతున్నాయి. గ్రేటర్​ సిటీలో చాలాచోట్లా రోడ్లు దెబ్బతింటుండగా, చేసిన పనినే పదేపదే చేస్తుండటంతో జీడబ్ల్యూఎంసీ నిధులు వృథా అవుతున్నాయి.

ఏటా రూ.2.5 కోట్లు ఖర్చు..

జీడబ్ల్యూఎంసీలోని 66 డివిజన్ల పరిధిలో 2.5 లక్షల ఇండ్లు ఉండగా, అమృత్ స్కీంలో భాగంగా అర్బన్ భగీరథ కింద ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా దాదాపు 26.7 కిలోమీటర్ల రా వాటర్ మెయిన్స్, 217 కిలోమీటర్లకుపైగా ఫీడర్ మెయిన్స్, దాదాపు 3 వేల కిలోమీటర్ల వరకు డిస్ట్రిబ్యూటరీ పైపులైన్లు వేశారు. ఇంత వ్యవస్థ ఉన్నా తాగునీటి సరఫరాకు పైపులైన్ లీకేజీలు సమస్యగా మారాయి. నగరంలోని అన్ని డివిజన్ల పరిధిలో దాదాపు 600 వరకు లీకేజీలు ఉన్నాయని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఇదిలాఉంటే ఫీడర్ మెయిన్స్ లో సగానికిపైగా దశాబ్ధాల కిందట వేసినవే కావడంతో చాలాచోట్ల శిథిలావస్థకు చేరి తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. 

దీంతో జీడబ్ల్యూఎంసీ అధికారులు ఏటా రూ.కోట్లు ఖర్చు పెట్టి రిపేర్లు చేయిస్తున్నారు. గడిచిన మూడేండ్లలో రూ.8.15 కోట్ల వరకు కేవలం పైపులైన్ల లీకేజీల కోసమే ఖర్చు చేశారు. ఇందులో 2022లో రూ.2.15 కోట్లు, 2023లో రూ.2.5 కోట్లు, రూ.2024లో రూ.3.5 కోట్ల వరకు లీకేజీల రిపేర్ల పేరున ఖర్చు పెట్టడం గమనార్హం. ఇంత ఖర్చు పెట్టినా రిపేర్లు చేసిన చోటనే మళ్లీ లీకవుతుండటంతో పనులు క్వాలిటీగా చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కింద పైపులు పైన గుంతలు..

నగరంలో చాలావరకు పైపులైన్లు మెయిన్ రోడ్ల కింద నుంచే ఉన్నాయి. దీంతో లీకేజీలు ఏర్పడిన ప్రతిసారి రోడ్లు ధ్వంసమవుతుండగా, వాటి రిపేర్లకు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఒకవేళ పైపులైన్ లీకేజీని అరికట్టి, సీసీ వేసినా మళ్లీ లీకవుతుండటంతో రోడ్లపై మూరెడు లోతు గుంతలు ఏర్పడుతున్నాయి. నల్లాలు వదిలినప్పుడు, వర్షాలు పడిన సందర్భంలో గుంతల్లో నీళ్లు నిలుస్తుండగా, ఆయా మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. 

ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటనలూ ఉన్నాయి. వాస్తవానికి వర్షాకాలం ఇలాంటి గుంతలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ఆఫీసర్లు వీటిని ముందస్తుగా గుర్తించి, తగిన రిపేర్లు చేయాల్సి ఉంటుంది. కానీ జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు మాత్రం అన్నీ తెలిసీ లైట్​ తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా గ్రేటర్​ వరంగల్ అధికారులు పైపులైన్ లీకేజీలు, రోడ్డు రిపేర్లపై దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

హనుమకొండ యాదవ్ నగర్ సమీపంలో కేయూ వైపు వెళ్లే మార్గంలో ఇలా ఒకేచోట ఎనిమిది లీకేజీలు ఉన్నాయి. గతంలో ఒకసారి వీటిని రిపేర్ చేసినా.. మళ్లీ నీళ్లు లీక్ అవుతున్నాయి. ఫలితంగా రోడ్డుపై ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, గుంతల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఇది గ్రేటర్​ వరంగల్ పరిధి వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ కు వెళ్లే మార్గంలోని పైపు లైన్ లీకేజీ. దాదాపు ఐదు నెలల కిందట ఇక్కడ లీకేజీ ఏర్పడగా, రోడ్డును తవ్వి రిపేర్ చేసి, సీసీ వేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్లీ లీక్ స్టార్ట్​ అయ్యింది. దీంతో రోడ్డు మళ్లీ ధ్వంసమవగా, దాదాపు నెల రోజుల తర్వాత ఆదివారం రిపేర్ పనులు చేపట్టారు. గడిచిన రెండేండ్లలో ఇదే ప్లేస్ లో నాలుగు సార్లు పైప్ లైన్ లీకవగా, దీనికి 50 అడుగుల దూరంలోనే మరో లీకేజీ ఏర్పడటం గమనార్హం.