సంక్షేమానికి చిరునామా తెలంగాణ: రేగా కాంతారావు

సంక్షేమానికి చిరునామా తెలంగాణ: రేగా కాంతారావు

భద్రాచలం,వెలుగు: దేశంలోనే సంక్షేమానికి చిరునామా తెలంగాణ రాష్ట్రం అని బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. భద్రాచలంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.   కేసీఆర్​ సీఎం పదవి చేపట్టాక ప్రతీ ఇంటికీ ఒక పథకం చేరిందన్నారు. అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. ఈసారి బీఆర్ఎస్​ అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపిస్తే, తానే స్వయంగా భద్రాచలం పై దృష్టి సారించి వందశాతం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

దసరా బుల్లోళ్లు, సంక్రాంతి గంగిరెద్దులు మీ వద్దకు ఓట్ల కోసం వస్తాయని, ఎన్నికల తర్వాత పెట్టె, బేడా సర్ధుకుని వారి ఊళ్లకు వెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు. భద్రాచలంలో గోదావరి వరదల శాశ్వత నివారణ కోసం రూ.2,200కోట్లతో యాక్షన్​ ప్లాన్​ సిద్ధంగా ఉందన్నారు. గొత్తికోయలకు ఎస్టీ సర్టిఫికేట్ల కోసం గిరిజన సంక్షేమశాఖ ద్వారా కేంద్రానికి సీఎం లేఖ పంపించారని తెలిపారు.  కార్యకర్తలు, లీడర్లు ఈగోలకు పోకుండా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మరో 30 ఏళ్ల పాటు తాను రాజకీయాల్లో కొనసాగుతానని, ప్రతీ లీడర్​కు రాజకీయ భవిష్యత్​ను కల్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రంలో తెల్లం వెంకట్రావు,  తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.