- సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు
- సోమాజిగూడలో ఆర్ట్ ఆఫ్ విజయనగర హంపి పుస్తకావిష్కరణ
పంజాగుట్ట, వెలుగు: విజయనగర సామ్రాజ్య చరిత్రను, హంపి వైభవాన్ని నేటి తరానికి చాటిచెప్పేలా త్వరలో ఒక భారీ సినిమాను నిర్మిస్తామని ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు వెల్లడించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో చరిత్రకారుడు మైనాస్వామి రాసిన ‘టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్ ఆఫ్ విజయనగర-– హంపి’ ఆంగ్ల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేటి తరం దర్శకులు చరిత్ర, ప్రాచీన కళల పట్ల ఆసక్తి చూపకపోవడం బాధాకరమన్నారు.
రచయిత మైనాస్వామి మాట్లాడుతూ.. విజయనగర కాలంలో జరిగినంత నిర్మాణ వైభవం మరే కాలంలోనూ జరగలేదని, పర్యాటక ప్రాంతాలపై సినిమాలు తీసేవారికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. అనంత్ టెక్నాలజీస్ చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావు మాట్లాడుతూ.. మనకున్న అపారమైన శిల్ప సంపదను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వీడన్ రచయిత గణపతి రెడ్డి, చరిత్రకారుడు నాగేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.
